ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి.. కాశ్మీర్ లోని కుల్గాంలో ఘటన..
ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన కాశ్మీర్ లోని కుల్గాంలో చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. అయితే ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు భారత సైన్యం తెలిపింది. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం సాయంత్రం ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు.
ఉగ్రవాదులపై బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో వారు భారీగా కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీకి చెందిన 15 కార్ప్స్ ట్వీట్ చేసింది.
‘‘కుల్గాంలోని హలాన్ ఎగువ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆగస్టు 4వ తేదీన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.’’ అని 15 కార్ప్స్ తన ట్వీట్ లో పేర్కొంది.
మద్యం తాగేందుకు పెన్షన్ డబ్బులివ్వాలని తండ్రితో గొడవ.. రూ.100 ఇవ్వలేదని హత్య..
ప్రస్తుతం ఆ ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా.. ఏప్రిల్, మే నెలల్లో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఐదుగురు కమాండోలతో సహా 10 మంది సైనికులు మరణించారు.