హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు భార్య ఉద్యోగం తొలగించిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతోె పరిపాలనలో మార్పులు చేర్పులు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గత బీజేపీ ప్రభుత్వంలో తాత్కాలిక ప్రతిపాదికన ఉద్యోగం పొందిన నూతన్ కుమారిని విధుల నుంచి తొలగించారు. ఆమె గతేడాది గురైన ప్రవీణ్ నెట్టారు భార్య.
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణ కన్నడ జిల్లాలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రవీణ్ కుమార్ నెట్టారు భార్య తాత్కాలిక నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. హత్యకు గురైన బీజేపీ యువమోర్చా నేత భార్య నూతన్ కుమారికి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రూప్ సీ పోస్టును ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆమె డ్యూటీకి హాజరై మంగళూరులో పనిచేస్తానని మాజీ ముఖ్యమంత్రి బొమ్మైను కోరారు. దానికి ఆయన అంగీకారం తెలిపారు. ఆమె అభ్యర్థన మేరకు మంగళూరులోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగంలో ఆమెకు సహాయకునిగా ఉద్యోగం ఇచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
కాగా.. ప్రభుత్వాలు మారినప్పుడు సాధారణంగా తాత్కాలిక సిబ్బందిని వెళ్లిపోవాలని చెబుతారని, నూతన్ కుమారి విషయంలో ప్రత్యేకంగా, కావాలని ఏమీ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయని ‘జీ న్యూస్’ నివేదించింది.ఇదిలా ఉండగా.. 2022 జూలై 26న నెట్టారు దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. ఇది ప్రతీకార హత్య అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురు దుండగులతో సహా 10 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు.
ప్రవీణ్ కుమర్ భార్య నూతన్ కుమారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని హిందూ కార్యకర్తలు గత బొమ్మై ప్రభుత్వాన్ని కోరుతూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. అలాగే నెట్టారు కుటుంబానికి బీజేపీ పార్టీ తరఫున ఇల్లు కూడా కట్టించింది.