జమ్ము కశ్మీర్లో ఉగ్ర ఘటనలు 168 శాతం తగ్గిపోయాయి: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
జమ్ము కశ్మీర్లో ఉగ్ర ఘటనలు 168 శాతం తగ్గిపోయాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లోనూ 94 శాతం కన్విక్షన్ రేటు ఉంటున్నదని వివరించారు. మోడీ హయాంలో జమ్ము కశ్మీర్లో మళ్లీ శాంతి పునరుద్ధరిస్తున్నదని తెలిపారు.
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వ హయాంలో జమ్ము కశ్మీర్లో శాంతి భద్రతలు పునస్థాపితం అవుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం అన్నారు. జమ్ము కశ్మీర్లో ఉగ్ర ఘటనలు 168 శాతం తగ్గిపోయాయని వివరించారు. అంతేకాదు, 2015 నుంచి ఇప్పటి వరకు వామపక్ష తీవ్రవాద ఘటనలు కూడా 265 శాతం మేరకు తగ్గాయని చెప్పారు.
మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించదని, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి అన్నారు. అందుకే అంత కచ్చితమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని వివరించారు. ఉరి అటాక్ జరగ్గానే అందుకు రెస్పాన్స్గా 2016లో సర్జికల్ స్ట్రైక్ చేపట్టారని తెలిపారు. పుల్వామాలో జవాన్లను ఆత్మాహుతి దాడిలో బలితీసుకున్న ఘటనకు రెస్పాన్స్గా 2019 లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టిందని స్పష్టం చేశారు. అంటే.. ఇలాంటి నిర్ణయాత్మక చర్యలు కచ్చితమైన ఫలితాలను రాబట్టాయని పేర్కొన్నారు.
2014 నుంచి తిరుగుబాట్ల వల్ల ఏర్పడే హింస 80 శాతం తగ్గిపోయిందని వివరించారు. పౌరుల మరణాలు కూడా 89 శాతం తగ్గిపోయాయని చెప్పారు. అలాగే, 6000 మంది సాయుధులు లేదా మిలిటెంట్లు సరెండర్ అయ్యారని తెలిపారు.
జమ్ము కశ్మీర్లో టెర్రర్ ఇన్సిడెంట్లు 168 శాతం తగ్గాయని, అలాగే, టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో 94 శాతం కన్విక్షన్ రేట్ ఉన్నదని వివరించారు. కాగా, 2015 నుంచి ఈ ఏడాది జూన్ వరకు వామపక్ష తీవ్ర వాద ఘటనలు సగానికి మించి తగ్గిపోయాయని, అవి 265 శాతం తగ్గిపోయాయని తెలిపారు. అదే విధంగా ఈశాన్య ప్రాంతాల్లనూ శాంతి శకాన్ని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రారంభించిందని వివరించారు. త్రిపుర, మేఘాలయాల నుంచి ఆఫ్స్పా (AFSPA) పూర్తిగా ఉపసంహరించారని తెలిపారు. అసోంలో 60 శాతం ఉన్నదని పేర్కొన్నారు. ఇక్కడ శాంతి పునరుద్ధరించడానికి సాయుధ బలగాలతో ఎన్నో ఒప్పందాలు చేశారని వివరించారు.