ప్ర‌స్తుత రోజుల్లో వైద్యం అంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. క‌న్స‌ల్టేష‌న్ ఫీజులు రూ. 500 వ‌స‌లూఉ చేస్తున్న రోజులివీ అయితే ఓ వ్య‌క్తి మాత్రం కేవ‌లం రూ. 10కే వైద్యం అందించాడు. ఎంతో మందికి వైద్యాన్ని అందించిన ఆ మ‌హానుభావుడు తుది శ్వాస విడించారు.

"పది రూపాయల డాక్టర్"గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ టి.ఏ. కనకరత్నం శనివారం తన 96వ ఏట వయోభారంతో తుదిశ్వాస విడిచారు. తంజావూరు జిల్లా పట్టుకొట్టైకి చెందిన శ్రీనివాసపురం వాసిగా ఉన్న ఆయన గత ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు.

డాక్టర్ కనకరత్నం భార్య కె. రాజలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1950ల చివర్లో వైద్య వృత్తిలోకి ప్రవేశించిన ఆయన, 1960లలో పట్టుకొట్టైలోని పెద్ద వీధిలో ఒక క్లినిక్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తూ కేవలం రూ.2 మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. తరువాత దీన్ని రూ.5గా, 1990 తర్వాత కేవలం రూ.10గా నిర్ణయించి అదే ధరను చివరి వరకు కొనసాగించారు.

పట్టుకొట్టైకి చెందిన 'కొట్టై' అంబిదాసన్, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ ఎన్. సెల్వం కలిసి ఆయన జీవితం, సేవలపై "ఎన్ వెర్గల్ విజుతుగల్" అనే పుస్తకం రచిస్తున్నారు. సెల్వం మాట్లాడుతూ, డాక్టర్ కనకరత్నం తన వైద్య జీవితంలో వేలాది ప్రసవాలను నిర్వహించారని, పట్టుకొట్టై తాలూకాలోని 50కి పైగా గ్రామాలకు ఆయన సేవలందించారని తెలిపారు.

చాలా సందర్భాల్లో కన్సల్టేషన్ ఫీజుగా రూ.10 కూడా ఇవ్వలేని పేదవారికి ఉచితంగా సేవలు అందించేవారు. అంతే కాకుండా, వైద్యానికి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఆయన వద్దకు రావడానికి కారణం ఆయన అనుభవం, తక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందించడమే అని సెల్వం తెలిపారు.

అలాగే, కోవిడ్ సమయంలో ఆయన ఆసుపత్రికి పక్కనే ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లోని అద్దెదారులకు రూ. 9 లక్షల అద్దెను మాఫీ చేశారు. సేవా దృక్పథంతో నడిచిన ఆయన జీవితాంతం ప్రజల కోసం అంకితభావంతో పనిచేశారు.