వధూవరులు పెళ్లిఖర్చులు చెప్పాల్సిందే : సుప్రీం
ఎన్ని చట్టాలు చేసినా.. ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. కఠినంగా వ్యవహరిస్తున్నా దేశంలో వరకట్న దురాచారం నానాటికి పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ఎన్ని స్వచ్చంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి
ఎన్ని చట్టాలు చేసినా.. ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. కఠినంగా వ్యవహరిస్తున్నా దేశంలో వరకట్న దురాచారం నానాటికి పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ఎన్ని స్వచ్చంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. వివాహ సమయంలో పెట్టే ఖర్చును తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనలు రూపొందించాల్సిందిగా సుప్రీం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
వధూవరులకు చెందిన రెండు కుటుంబాలు సంయుక్తంగా పెళ్లి ఖర్చు వివరాలను వివాహ ధ్రువీకరణ అధికారి వద్ద రిజిస్టర్ చేసేలా నిబంధన తీసుకురావాలని సుప్రీం సూచించింది. తద్వారా వరకట్న దురాచారాన్ని రూపుమాపడంతో పాటు.. వరకట్న నిషేధ చట్టం కింద నమోదయ్యే నకిలీ కేసులను నివారించవచ్చని అభిప్రాయపడింది. అలాగే వివాహ సమయంలో చేసే ఖర్చులో కొద్ది మొత్తాన్ని వధువు పేరిట డిపాజిట్ చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.