సునీల్ జాఖర్ బీజేపీలో చేరకముందే ఆ పార్టీ కోసం పని చేశారు - పంజాబ్ కాంగ్రెస్ చీఫ్
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఆ పార్టీ మాజీ నాయకుడు సునీల్ జాఖర్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన బీజేపీ కోసం చాలా కాలం నుంచే పని చేస్తున్నారని ఆరోపించారు. జాఖర్ అందుకే హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నట్టు ఇప్పుడు అర్థం అవుతోందని అన్నారు.
బీజేపీలో చేరిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్పై ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన బీజేపీలో అధికారికంగా గురువారం నాడు చేరారని.. కానీ అనధికారంగా ఆ పార్టీ కోసం చాలా కాలం నుంచే పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీలో చేరడం తాను ముందే ఊహించానని, ఇది కొత్త విషయం ఏమీ కాదని తెలిపారు.
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసంతృప్తిగా ఉన్న సునీల్ జాఖర్ ఆ పార్టీకి ఈ నెల 3వ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆయన గురువారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసింది. ఈ విషయంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ నిందలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ట్వీట్ చేశారు. ‘‘ అనుకోలేదు... సునీల్ జాఖర్ బీజేపీలో అధికారికంగా చేరి ఉండవచ్చు, కానీ అతను చాలా కాలం కిందటి నుంచే ఆ పార్టీ కోసం పని చేయడం ప్రారంభించాడు, కఠోర హిందూత్వ రాజకీయాలు చేస్తూ, పార్టీని అన్ని విధాలుగా దెబ్బతీశాడు. ఆయన హిందుత్వ కార్డును లాగేసుకోవడానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటో ఈ రోజు వెల్లడైంది ’’ అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సునీల్ జాఖర్ తో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అమరీందర్ సింగ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత పంజాబ్ లో బీజేపీకి మిత్రపక్షంగా ఓ పార్టీని స్థాపించారు. ఆయన సునీల్ జాఖర్ కు అభినందలు తెలుపుతూ ఈ విధంగా ట్వీట్ చేశారు.’’ రైట్ మ్యాన్ ఇన్ ది రైట్ పార్టీ. సునీల్ జాఖర్ కు బీజేపీలో చేరినందుకు అభినందనలు. ఆయన లాంటి నిజాయితీ, నిక్కచ్చి నాయకులు ఇకపై కాంగ్రెస్ పార్టీలో ఊపిరి పీల్చుకోలేరు’’ అని పేర్కొంటూ ఆయన పోస్ట్ చేశారు.
Sunil Jakhar : బీజేపీలో చేరిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్
2021లో ఆయన సీఎం గా ఉన్నప్పుడు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ను విడిచిపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒక తప్పు నిర్ణయం కారణంగా ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే ఆ పార్టీ పంజాబ్లో పూర్తిగా పతనమైందని అమరీందర్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ ఆసన్న వినాశనం వైపు పయనిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆ మునిగిపోతున్న ఓడ నుంచి మరికొంత మంది నాయకులు పారిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ ఆ సమయంలో నేను సీఎంగా ఉన్నాను. సునీల్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రతిదీ చాలా సజావుగా సాగుతోంది. మేము ఒక ఏడాది కిందటే ప్రభుత్వాన్ని పునరావృతం చేయడానికి వెళాం. కానీ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఒక తప్పు నిర్ణయం దేశంలోని ఇతర ప్రదేశాల మాదిరిగానే ఇప్పుడు పంజాబ్లో కూడా సొంత విధ్వంసం కొని తెచ్చుకుంది. ’’ అని ఆయన అన్నారు.