Sunil Jakhar : బీజేపీలో చేరిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ గురువారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నాడు. ఇటీవల ఆయన ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో ఆ పార్టీ ప్రోగ్రాం ‘చింతన్ శివిర్’ జరుగుతున్న సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీలో చేరిక తరువాత సునీల్ జాఖర్ సునీల్ ఏఎన్ఐతో మాట్లాడారు. తన కుటుంబంలోని మూడు తరాలు గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాయని అన్నారు. పంజాబ్లో జాతీయవాదం, ఐక్యత, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై కాంగ్రెస్తో ఉన్న 50 ఏళ్ల నాటి బంధాన్ని తాపే ఈరోజు తెంచుకున్నాను అని తెలిపారు.
బ్రేకింగ్ : పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి జైలు శిక్ష
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న జాఖర్ కు తమ పార్టీలో కి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. పంజాబ్లో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పెద్ద పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. “ నేను సునీల్ జాఖర్ను భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తున్నాను. ఆయన తన రాజకీయ జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. పంజాబ్లో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పెద్ద పాత్ర పోషిస్తారని నాకు నమ్మకం ఉంది ’’ అని ఆయన పేర్కొన్నారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన తరువాత సునీల్ జాఖర్ గత వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. అయితే జాఖర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కొందరు పంజాబ్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించింది. అయితే అంతకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోని ‘పంజాబ్ లో హిందూ సీఎం ఉండటం వల్ల కలిగే పరిణామాలపై’ చేసిన వ్యాఖ్యలపై సునీల్ జాఖర్ మండిపడ్డారు. ఆమెను తీవ్రంగా విమర్శించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సోనీ ప్రకటన కూడా ఒక కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీకి కొంత దూరం అయ్యారు.
సునీల్ జాఖర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ చీఫ్ గా కూడా పని చేశారు. ఆయన ఆ రాష్ట్రంలో ప్రముఖ హిందూ ఫేస్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సీనియర్ మోస్ట్ నాయకుడిగా పేరుంది. అయితే కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ.. మే 14వ తేదీన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. నేడు బీజేపీలో చేరారు. అయితే ఆయనను బీజేపీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.