Sri Lanka economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్ష‌భం మ‌రింత‌గా ముదురుతోంది. ఇప్ప‌టికే ఆ దేశ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోవ‌డంతో ఆ దేశాన్ని వీడి.. భార‌త్ ఆశ్ర‌యం కోరుతూ  శ్రీలంక వాసులు సరిహద్దులకు వస్తున్నారు. 

Sri Lanka economic crisis: శ్రీలంక తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రజ‌ల ప‌రిస్థితులు దారుణంగా మారాయి. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తిన‌డానికి ఆహారం దొర‌క‌ని దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే శ్రీలంక ప్ర‌పంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఇదిలావుండ‌గా, తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోవ‌డంతో ఆ దేశాన్ని వీడి.. భార‌త్ ఆశ్ర‌యం కోరుతున్నారు శ్రీలంక వాసులు. తాజాగా 19 మంది శ్రీలంక వాసులు భారతదేశంలో ఆశ్రయం కోరుతూ తమిళనాడు చేరుకున్నారు. శ్రీలంక తమిళులు పడవలో ధనుష్కోడి చేరుకున్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్రీలంక వాసులు భారత తీరానికి చేరుకుంటున్నారు.

జాఫ్నా, మన్నార్ నుండి 19 మంది శ్రీలంక తమిళులు పడవలో తమిళనాడులోని ధనుష్కోడి చేరుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో నివసించడం చాలా కష్టంగా మారిందని భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఈ వ్యక్తులు చెప్పారు. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్ప‌టికే ప‌లువురు శ్రీలంక వాసులు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. శుక్రవారం ఇద్దరు పిల్లలతో దంపతులు సముద్రం దాటి భారత తీరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మహిళలు, చిన్నారులు సహా మొత్తం 39 మంది ఆశ్రయం పొందేందుకు భారత తీరానికి చేరుకున్నారు. శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తలదాచుకునేందుకు పలువురు తమిళనాడు సరిహద్దులకు చేరుకుంటున్నారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. 

81 బిలియన్ డాలర్ల శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. దేశం తన వద్ద ఉన్న విదేశీ నిల్వల కంటే మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లించాల్సి రావడంతో ఇప్పుడు తన అప్పులను ఎగవేసేందుకు సిద్ధంగా ఉంది. అప్పుల ఊబి నుండి ద్రవ్యోల్బణం వరకు అనేక అంశాలు కొనసాగుతున్న సంక్షోభాన్ని సృష్టించాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితులు నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్త‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వంలోని చాలా మంది మంత్రులు మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు. అయితే, సంక్షోభానికి కార‌ణం రాజపక్స నే అంటూ ప్ర‌జ‌లు .. ఆయ‌న పై మండిప‌డుతున్నారు. 

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి శ్రీలంకకు ఆర్థిక సహాయంగా భారతదేశం ఇటీవల ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది. కొలంబోకు మరో రెండు ఇంధన నౌకలను రుణం కింద పంపుతున్నట్లు భారత హైకమిషన్ బుధవారం ప్రకటించింది. భారత్ నుంచి శ్రీలంకకు కూడా బియ్యం సరుకులు పంపుతున్నారు. తమిళుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీలంకకు బియ్యం, ప్రాణాలను రక్షించే మందుల వంటి నిత్యావసర వస్తువులను పంపేందుకు తమిళనాడు సిద్ధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం కేంద్రానికి తెలియజేశారు. అనుమ‌తిస్తే భారత హైకమిషన్ ద్వారా పంపిణీకి చేస్తామ‌ని తెలిపారు. ఇదిలావుండ‌గా, శ్రీలంక ఏప్రిల్ 11న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ‌తో చర్చలను ప్రారంభించనుంది. ఈ చర్చలు విదేశీ రుణ పునర్నిర్మాణంపై సహాయంతో సహా సాధ్యమైన బెయిలౌట్‌కు దారి తీస్తుంది.