స్మృతి ఇరానీకి చెవుడు, మూగ: కాంగ్రెస్ నేత శ్రీనివాస్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. బీజేపీ ఫైర్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చెవుడు, మూగ అని కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గతంలో ఆయన చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ నేతలు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చెవుడు, మూగ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. శ్రీనివాస్ బీవీ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైరల్ అయిన వీడియో క్లిప్లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ఇలా మాట్లాడారు. ‘స్మృతి ఇరానీకి ఇప్పుడు చెవులు వినిపించడం లేదు. మాటలు కూడా రావడం లేదు. ఒకప్పుడు ధరల పెరుగుదల భూతం ఇప్పుడు వారికి డార్లింగ్ అయి కూర్చుంది’ అని అన్నారు.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆ చిన్న వీడియో క్లిప్ను షేర్ చేసి ‘మర్యాద తెలియని, ఆడవారిని గౌరవించిన ఈ మనిషి ఇండియన్ యూత్ కాంగ్రెస్కు జాతీయ అధ్యక్షుడు. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించినందుకు ఒక మహిళా మంత్రిని ఉద్దేశించి మాట్లాడే తీరు ఇలా ఉన్నది. ఫ్రస్ట్రేషన్లో ఉన్న కాంగ్రెస్ ప్రాసంగికత లేకుండా పోతున్నది’ అని ట్వీట్ చేశారు.
చాలా మంది సోషల్ మీడియా యూజర్లు నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ను ట్యాగ్ చేస్తూ ఆ కాంగ్రెస్ నేత పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులూ ఆయనపై యాక్షన్ తీసుకోవాలని కోరారు.
కాగా, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ ఈ వివాదంపై స్పందించారు. తనను సమర్థించుకుంటూ ఆ వీడియోను కట్ చేసి వారి వివాదానికి అనుకూలంగా మార్చుకున్నారని విమర్శించారు.
‘ఈ సంఘీలు ఎప్పటికీ మారరు. నా మొత్తం స్టేట్మెంట్ను ప్లే చేయండి. అందులో సగాన్ని చూపి వివాదంగా చూపించవద్దు. 2014కు ముందే రాహుల్ గాంధీపై ఆమె గెలవడానికి ముందు చేసిన స్టేట్మెంట్ అది. ఎల్పీజీ సిలిండర్ పై ధర రూ. 400 ఉంటే అది వారికి భూతంగా కనిపించిందని, అదే ఇప్పుడు రూ. 1100కు పెరిగినా డార్లింగ్ రూపంలోనే వారికి కనిపిస్తున్నది.’ అని శ్రీనివాస్ బీవీ పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన ఆ స్టేట్మెంట్ పూర్తి వీడియో క్లిప్ను ప్లే చేశారు.