పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు షాక్.. ఇక అన్ని వర్సిటీలకు దీదీనే ఛాన్సలర్..నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విభేదాలు ముదిరిపాకాన పడుతున్నాయి. గవర్నర్ కు ఉండే అధికారలకు కత్తెర వేయాలని మమతా బెనర్జీ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే యూనివర్సిటీలకు ఛాన్సలర్ బాధ్యతను ఆయన దగ్గర నుంచి తీసుకోనుంది.
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా గవర్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ లో కూడా అదే జరిగింది. అయితే ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఈ పద్దతి మారనుంది. రాష్ట్ర పరిధిలో వచ్చే అన్ని వర్సిటీలకు ఇక ముఖ్యమంత్రే ఛాన్సలర్ గా మారనున్నారు. ఈ మేరకు చట్టాన్ని సవరించే పనిలో పడింది మమతా బెనర్జీ సర్కార్.
ఇంగ్లీషు చదవలేక..ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
ఈ విషయంలో గురువారం నాడు రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం గవర్నర్ స్థానంలో అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా సీఎంగా ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది. సీఎంను ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా చేయడానికి అవసరమైన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సవరించనుంది.
కేబినెట్ సమావేశం అనంతరం బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని ప్రకటించారు. యూనివర్శిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్ అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం పలువురు వైస్ ఛాన్సలర్లను నియమించిందని గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ గతంలో ఆరోపించారు.
ఈ ఏడాది ప్రారంభంలో 25 విశ్వవిద్యాలయాల వీసీలను ఛాన్సలర్ ఆమోదం లేకుండా అక్రమంగా నియమించారని గవర్నర్ ధంఖర్ ఆరోపిస్తున్నారు. అయితే గత డిసెంబర్ లోనే యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్గా ఉండాలా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని బ్రత్యా బసు చెప్పడం గమనార్హం. ‘‘ గవర్నర్ తన పదవిని బట్టి విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా ఉన్న వలసవాద వారసత్వాన్ని మనం కొనసాగించాలా లేక ప్రముఖ పండితులు, విద్యావేత్తలను ఛాన్సలర్లుగా నామినేట్ చేయాలా అని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ’’ అని బ్రత్యా బసు ట్వీట్ చేశారు.
కొంత కాలంగా పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ ధంఖర్ కు విభేదాలు కొనసాగుతున్నాయి. సందర్భానుసారం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కు ఉన్న అధికారాలకు కత్తెర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో గవర్నర్ పై ప్రభుత్వం అభిశంసన తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని కూడా భావించింది.