ఇంగ్లీషు చదవలేక..ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
కర్ణాటకలో ఓ విద్యార్థి ఇంగ్లీషు చదవలేకపోతున్నానన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని వెంటనే తల్లిదండ్రులు గమనించడంతో ప్రమాదం తప్పింది.
కర్నాటక : karnatakaలో ఇంగ్లీషు చదవలేక ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. తుమకూరు తాలూకా ఉర్గిగెరె గ్రామానికి చెందిన అజయ్ (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇంగ్లీషు చదవడం కష్టంగా ఉందని, పాఠశాలకు వెళ్ళేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి పాఠశాలకు పంపుతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాలుడు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది.
మరో ఘటనలో.. కర్నాటకలోని బనశంకరి లో ద్విచక్ర వాహనాన్ని స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బనశంకరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. నాయండహళ్లి నివాసి కీర్తన (16) తన అక్క హర్షితతో కలిసి కనకపుర వద్ద ఉన్న హోరోహళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం నాయండహళ్లికి వెళ్లేందుకు దేవేగౌడ పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆలస్యం అయిందని భావించి స్నేహితుడు దర్శన్ తో కలిసి బైక్ పై ఇంటికి బయలుదేరారు.
కిత్తూరు రాణి చెన్నమ్మ జంక్షన్ నుంచి కామాఖ్య వైపు వెళ్తుండగా.. పై వంతెన వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొంది. దీంతో ముగ్గురు కిందపడిపోయారు.ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న బస్సు కీర్తన తలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కీర్తన ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష. ఉత్తీర్ణురాలు అయింది. హర్షిత ద్వితీయ పియుసి పరీక్ష రాసి ఫలితాల కోసం వేచి చూస్తోంది అని బనశంకరి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
నీళ్ల ట్యాంకర్ ఢీకొని..
బనశంకరిలోనే మరో ఘటన జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హెచ్ ఎస్ ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్దార్ పుర రోడ్డులోని శ్వేతా రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఎదురుగా గురువారం వాటర్ ట్యాంకర్ నీటిని అప్లోడ్ చేసి రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనక ఉన్న బాలికను ఢీ కొట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక పేరు ప్రతిష్ఠగా పోలీసులు గుర్తించారు. బాలికను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హెచ్ఎస్ఆర్ లేవుట్ పోలీస్ డ్రైవర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.