కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇవాళ పాటియాల కోర్టుకు హాజరయ్యారు. సునంద పుష్కర్ మృతి కేసులో సిట్ మూడు వేల పేజీల  చార్జీషీట్‌ను శశిథరూర్ పై దాఖలు చేసింది.  ముందస్తు బెయిల్ మంజూరు చేసినందున సాధారణ బెయిల్ కు ధరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. 


న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ కు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశిథరూర్‌ ‌కు శనివారం నాడు పాటియాల కోర్టుకు హాజరయ్యారు.

సునంద పుష్కర్ మృతి కేసులో సిట్ బృందం శశిథరూర్‌కు వ్యతిరేకంగా మూడువేల పేజీల చార్జీషీట్‌ను దాఖలు చేసింది. సునంద పుష్కర్ కేసులో థరూర్‌ను ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే కోర్టు జులై 7న కోర్టు ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది.

దీంతో ఇవాళ ఢిల్లీ కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఢిల్లీ కోర్టు ఆయనకు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ రూ.లక్ష పూచీకత్తుపై ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసినందున సాధారణ బెయిల్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

2014 జనవరి 17న సునంద పుష్కర్‌ దిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అంతకుముందు రెండ్రోజుల క్రితమే పుష్కర్‌ తన భర్త థరూర్‌కు పాకిస్థాన్ జర్నలిస్ట్‌తో సంబంధం ఉందని నిందిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

 పుష్కర్‌ మరణించడానికి ముందు రోజుల్లో థరూర్‌ ఆమె ఫోన్‌కాల్స్‌ను నిర్లక్ష్యం చేశాడని ఆమె కాల్స్‌ కట్‌ చేశారని అందువల్లే ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఆమె మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు వెల్లడించారు. థరూర్‌పై సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని హింసించారని ఆరోపణలు ఉన్నాయి.