చిదంబరం ఇంట్లో చోరీ.. ఏం మాయమయ్యాయంటే.. ఫిర్యాదు వెనక్కి.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని సుగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్లోని ఆయన ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని సుగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్లోని ఆయన ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు.. చిదంబరం భార్య నళిని నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి.. శనివారం రాత్రి ఇంటికి తిరిగివచ్చారు. తలుపులు తెరిచి చూడగా అల్మారాలు ఓపెన్ చేయడంతో పాటు బెడ్రూమ్ చిందరవందరగా ఉండటంతో దొంగతనం జరిగిందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విలువైన ఆభరణాలతో పాటు, రూ.1.50 లక్షల నగదు, ఖరీదైన చీరలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ గమనిస్తే.. ఇద్దరు మహిళలు మాస్కులు ధరించి లోపలికి వెళుతుండటం గమనించింది.. పది రోజుల క్రితమే చోరీ జరిగిందని.. దీని వెనుక ఇద్దరు పనిమనుషుల ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే తాము దొరికిపోయామని భావించిన పనిమనుషుల కుటుంబసభ్యులు.. చోరీ చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో.. నళిని చిదంబరం ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు.
తొలుత విలువైన పత్రాలు, వజ్రాలు పోయినట్లు వార్తలు రావడం.. ఐఎన్ఎక్స్ మ్యాక్స్ మీడియా కేసు విచారణ వేగవంతంగా జరుగుతుండటంతో చిదంబరం ఇంట్లో చోరీ పలు అనుమానాలు కలిగించింది.. చివరకు పనిమనుషులే చోరీని అంగీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.