శివసేన పార్లమెంటరీ నేతగా సంజయ్ రౌత్ తొలగింపు.. కొత్త నాయకుడిగా ఎంపీ గజానన్ కీర్తికర్ నియామకం..
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీని నిజమైన శివసేనగా ఎన్నికల సంఘం గత నెల గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ నేత పదవి నుంచి సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ను షిండే తొలగించారు. కొత్త నాయకుడిగా గజానన్ కీర్తికర్ ను నియమించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తన పార్లమెంటరీ నేతగా సంజయ్ రౌత్ను తొలగించింది. ఆయన స్థానంలో లోక్సభ ఎంపీ గజానన్ కీర్తికర్ ను నియమించింది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్లకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాసిన లేఖలో కీర్తికర్ను శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించినట్లు తెలియజేశారు. దీంతో పార్లమెంటు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శివసేన నాయకులు కీర్తికర్ను గురువారం సన్మానించారు.
లోక్సభలో ఉన్న 18 మంది శివసేన సభ్యులలో నలుగురు ఉద్ధవ్ థాకరే వెంట ఉన్నారు. మిగిలిన వారంతా షిండే వెంటనే ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, ఎన్సీపీలతో ఠాక్రే చేతులు కలిపారని, పార్టీ ప్రధాన ఆదర్శాలతో రాజీపడ్డారని ఆరోపిస్తూ ఏక్ నాథ్ షిండే గత ఏడాది శివసేనను విభజించారు. తరువాత ఉద్ధవ్ నేతృత్వంలోని సేనకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు షిండే శిబిరంలో చేరారు.
మత్తుమందు ఇచ్చి 5వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, స్కూల్ ప్యూన్ అరెస్ట్
ఈ పరిణామాలతో మహారాష్ట్రలో ఉన్న ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయింది. షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రెండు పార్టీల నాయకులు కొత్త మంత్రి వర్గంలో చేరారు. కాగా.. గత నెలలో ఎన్నికల సంఘం షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించింది. దానికి విల్లు, బాణం గుర్తును కూడా కేటాయించింది. ప్రస్తుతం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇందులో సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్, ప్రియాంక చతుర్వేది ఉన్నారు. వీరంతా ఉద్దవ్ ఠాక్రే వెంటనే ఉన్నారు.