పంజాబ్ లో రెడ్ అలెర్ట్.. ఘటనపై నివేదిక కోరిన మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్..
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టులో పేలుడు సంభవించడంతో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇందులో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ పంజాబ్ రాష్ట్రాన్ని ఆదేశించింది.
PUNJAB LUTHIYANA COURT BLAST : పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లా కోర్టులో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు కోర్టు కాంప్లెక్స్లోని రెండో అంతస్థులోని వాష్ రూమ్లో జరిగింది. ఈ పేలుడు వల్ల ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. రాష్ట్రం మొత్తం రెడ్ అలెర్ట్ విధించింది. మరోవైపు పేలుడు ఘటనపై నివేదిక సమర్పించాలని మినిస్ట్రీ ఆఫ్ హోం ఆఫైర్స్ పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ పేలుడు ఎలా జరిగిందో అనే విషయం పోలీసు అధికారులు ఇంకా నిర్ధారించలేదు. పేలుడు జరిగిన ప్రదేశంలో మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వారు ఎవరనేది పరిశీలిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని లూథియానా పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లర్ తెలిపారు. బాంబ్ స్క్వాడ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇంకా ఏమైనా బాంబులు ఉంటే వాటిని నిర్వీర్యం చేస్తాయని చెప్పారు. పోలీసులు కోర్టు కాంప్లెక్స్లో సోదాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్ఎస్జీ బృందాలు కూడా ఘటనా స్థలానికి త్వరలో చేరుకుంటాయని అన్నారు.
ఆవులు పవిత్రమైనవి, మేము తల్లిగా గౌరవిస్తాము.. కానీ కొందరు.. : వారణాసి వేదికగా ప్రధాని మోదీ
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం - సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ
లూథియానా కోర్టులో పేలుడుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీఅన్నారు. త్వరలోనే ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి పనులు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం..
ఘటన జరిగిన లూథియానా కోర్టు కాంప్లెక్స్ను పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జీందర్ సింగ్ రంధావా పరిశీలించారు. తమ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. పంజాబ్ అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రం. బయటి శక్తులు ఈ ఘటన చేయలేదనే విషయాన్ని తోసిపుచ్చలేం. అందుకే ముందస్తుగా రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించామని అన్నారు. ముఖ్యమైన ఆధారాల కోసం తమ అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అన్ని సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉండవచ్చు అని అన్నాఉఉ.
ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే
లూథియానా కోర్టులో పేలుడు జరిగిన సమయంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ బైన్స్ అక్కడే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై ఆయన మాట్లాడారు. కాంప్లెక్స్ లో భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఇది చాలా పెద్ద పేలుడని ఎమ్మెల్యే అన్నారు.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. పండుగల సెలబ్రేషన్స్పై ఆంక్షలు పెట్టండి: రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
ఘటనపై పంజాబ్ నేత అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్ పోలీసులు త్వరలోనే ఈ కేసును ఛేదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొందరు సంఘ వ్యతిరేక వ్యక్తులు కోరుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదొక కుట్ర అని పేర్కొన్నారు. మృతుల కుటుంబీకులు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.