పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. పండుగల సెలబ్రేషన్స్పై ఆంక్షలు పెట్టండి: రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
దేశంలో ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.
దేశంలో ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని సూచించింది. కోవిడ్, ఒమిక్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను పర్యవేక్షించాలని సూచించింది.
కోవిడ్ క్లస్టర్లలో కంటైన్మెంట్, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని కోరింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని సూచించింది. పండుగల సీజన్లో ఆంక్షలు, పరిమితులను విధించాలని కోరింది. ప్రజలు గూమిగూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని.. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కేంద్రం సూచించింది. ప్రజలందరూ మాస్క్లు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఇక, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. తాజాగాతెలంగాణలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 14 మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తమిళనాడులోనూ (Tamil Nadu) భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అక్కడ నిన్నటివరకు ఒక ఒమిక్రాన్ కేసు మాత్రమే నమోదు అవ్వగా.. తాజాగా ఒకేసారి 33 మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. దీంతో తమిళనాడులో మొత్తం Omicron Cases సంఖ్య 34కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ గురువారం తెలిపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూడటంతో తమిళనాడులో ఆందోళన నెలకంది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 300కు చేరువలో ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఈ సమావేశం జరగనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై చర్చించనున్నారు.