సారాంశం

రాజస్తాన్‌లో ‘‘ భారత్ మాతా హై కౌన్ ’’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు రంగంలోకి దిగి తమ తమ అభ్యర్ధుల తరపున హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో ‘‘ భారత్ మాతా హై కౌన్ ’’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుండీలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ భారత్ మాతాకీ జై’’కి బదులుగా ‘‘అదానీ జీ కీ జై’’ అనాలి. ఎందుకంటే ఆయన (మోడీ) తన కోసం పనిచేస్తున్నారు కాబట్టి అంటూ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంలో అనవసర ప్రయోజనాలను ఆరోపిస్తూ.. అదానీ గ్రూపును రాహుల్ గాంధీ తరచుగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. 

 

 

 

 

అదానీ స్కాంలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ గ్రూప్ హిండెన్ బర్గ్ బయటపెట్టిన నివేదిక తర్వాత ఆ పార్టీ నేతలు .. ముఖ్యంగా రాహుల్ గాంధీ అదానీపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ అదానీ- మోడీ సంబంధాలపై రాహుల్ గాంధీ వాడి వేడి విమర్శలు చేస్తున్నారు.