Rajnath Singh: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చెప్పినవాటిని చదివి, నమ్మేస్తారని, వాస్తవాలను పరిశీలించరని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బల్‌దేవ్‌లో జరిగిన బీజేపీ ప్రచార సభలో మాట్లాడుతూ, పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించారు.   

Rajnath Singh: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చెప్పినవాటిని నమ్మేస్తారని, వాస్తవాలను తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపార‌ని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బల్‌దేవ్‌లో జరిగిన బీజేపీ ప్రచార సభలో మాట్లాడుతూ.. చైనా, పాక్ విష‌యంలో పార్ల‌మెంట్ వేదిక‌గా  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లను ప్రస్తావించారు. రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. గాల్వాన్ ఘర్షణల అంశాన్ని లేవనెత్తి.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై మాటాల తూటాలు పేల్చాడు. వారు భారత సైనికుల పరాక్రమాన్ని విశ్వసించడం లేదని తీవ్రంగా మండిప‌డ్డారు. చైనా మీడియానే న‌మ్ముతార‌ని, చైనా మీడియాపైనే రాహుల్ ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌తార‌ని రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఆక్షేపించారు.

గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌లో భార‌త సైనికులే చాలా మంది వీర మ‌ర‌ణం పొందార‌ని, చైనా వాళ్లు త‌క్కువ మందే చ‌నిపోయార‌ని రాహుల్ పేర్కొన్నారని తెలిపారు. రాహుల్ చైనా మీడియానే ఎక్కువ‌గా న‌మ్ముతారు.ఈ ఘర్షణలో 38 నుంచి 50 మంది వరకు చైనా జవాన్లు మరణించారని ఇటీవల ఓ ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించిందన్నారు. భారత దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నారు.  భార‌త ఆర్మీ ప‌రాక్ర‌మంపై రాహుల్‌కు విశ్వాసం లేదు అని రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా మండిప‌డ్డారు.

ప్రపంచ దేశాలు గతంలో భారత దేశాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకునేవి కాదన్నారు. ఇప్పుడు యావత్తు ప్రపంచం మనం చెప్తున్నదానిని వింటోందన్నారు. ఉరి, పుల్వామాలలో ఉగ్రవాద దాడుల అనంతరం మన సైన్యం పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్నారు. మనం ఓ గట్టి సందేశాన్ని పంపించామన్నారు. మేము సరిహద్దు దేశాల దాడుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోంటున్నామ‌ని రక్షణ మంత్రి అన్నారు. రక్షణ మంత్రిగా, భారతదేశ ఆర్మీ పై ఎవరూ దాడి చేయలేరని తాను దృఢంగా విశ్వసిస్తున్నానని సింగ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం గురించి రక్షణ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను నిర్వహించడంలో ముఖ్యమంత్రి విజయం సాధించారని, యోగీ ఈ విష‌యంలో ప్రశంసలకు అర్హుడని అన్నారు. యూపీ నుంచి నేరస్థులు పారిపోతున్నారు, మాఫియా అంతం అవుతుంది. యూపీ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఎక్స్‌ప్రెస్‌వేలు వస్తున్నాయి, తహసీల్‌లు, బ్లాక్ హెడ్‌క్వార్టర్‌లను అనుసంధానించడానికి రోడ్లు నిర్మించబడుతున్నాయ‌ని ఎప్పుడు ఊహించ‌లేద‌నీ, కానీ యోగీ హ‌యంలో జ‌రిగాయ‌ని తెలిపారు.
 
శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ వంటి నేతలు ఇచ్చిన హామీలకు ఇతర పార్టీలు కట్టుబడి ఉంటే భారతదేశం మరోలా ఉండేదన్నారు. 1951 ఎన్నికలలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ.. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయాలని జన్ సంఘ్ మ్యానిఫెస్టోలో ప్రస్తావించారు, కాని మేము పార్లమెంటులో మెజారిటీ సాధించలేకపోయారు. మెజారిటీ వచ్చిన తర్వాత .. ప్ర‌ధాని మోడీ హ‌యంలో ఆర్టికల్ 370ని రద్దు చేశామ‌ని తెలిపారు. బీజేపీకి అనుకూలంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరుతూ.. నూత‌న‌ ఉత్తరప్రదేశ్, న‌వ‌ భారత్ కావాలనుకుంటే.. బిజెపి అభ్యర్థికి ఓటు వేయండని రాజ‌నాథ్ సింగ్ అన్నారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ 312 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించింది. 403 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 39.67 శాతం ఓట్లను సాధించింది. ఎస్పీ 47 సీట్లు గెలుచుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 19 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లో  పోలింగ్ జరుగ‌నున్న‌ది. తొలి దశ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగనుండగా, చివరిదైన ఏడోదశ పోలింగ్ మార్చి 7న ముగుస్తుంది. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడతాయి. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే దశ(రెండో ఫేజ్)లోనే పోలింగ్ పూర్తవుతుంది. ఇక మణిపూర్ లో రెండు దశల్లో(ఐదు, ఆరో ఫేజ్ లో) పోలింగ్ జరుగనుంది.


రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

రాహుల్ గాంధీ బుధవారం పార్ల‌మెంట్ లో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా విదేశీ నేతలను ఎందుకు పిలువ‌లేద‌ని ప్ర‌శ్నించారు. దేశాన్ని ఏకాకిగా మార్చుతున్నార‌నీ.. మన దేశాన్ని శత్రువులు చుట్టుముట్టుతున్నాయ‌ని, తామేం చేయాలనుకుంటున్నదీ చైనీయులకు స్పష్టత ఉందని చెప్పారు. ప్ర‌ధాని మోడీ విధానాల వల్లే..  చైనా, పాకిస్థాన్ సన్నిహితంగా మారాయ‌ని ఆరోపించారు. చైనా, పాక్ విష‌యంలో పార్ల‌మెంట్ వేదిక‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్య‌లపై చ‌ర్చ సాగుతునే ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో స‌హా, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ట్వ‌ర్ సింగ్ రాహుల్ వ్యాఖ్య‌లను త‌ప్పుబ‌ట్టారు. తాజాగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌ప్పుబ‌ట్టారు.