రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిధిని అతిక్రమించారు - బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిధులను అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాటలను ఎవరూ వినడం లేదని, కేవలం సహిస్తున్నారని తెలిపారు.
రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిధులను అతిక్రమిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. చెన్నైలో జరుగుతున్న ఆ పార్టీ యువజన విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా ‘జాతీయ యువజన పార్లమెంటు’ను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ గా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మానసికంగా దివాళా తీసిందని ఆయన విమర్శించారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ అన్నారని, అమెరికా, యూరోపియన్ దేశాల వంటి విదేశీ శక్తులు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కోరారని తెలిపారు.
రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటనలు చేస్తారని నడ్డా ప్రశ్నించారు. భారత ప్రజలు ఆయన మాట వినరని, కేవలం సహిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్య విలువల గురించి సిగ్గుమాలిన వ్యాఖ్యలతో దేశాన్ని అవమానించడమే కాకుండా, మన దేశంలో జోక్యం చేసుకోవాలని విదేశాలను ఆహ్వానించారని విమర్శించారు.
కాగా.. శనివారం కూడా జేపీ నడ్డా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. జాతి వ్యతిరేక టూల్ కిట్ లో రాహుల్ గాంధీ శాశ్వత భాగమైపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. ‘‘దేశం పదేపదే తిరస్కరించిన తరువాత, రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ జాతి వ్యతిరేక టూల్ కిట్ లో శాశ్వత భాగం అయ్యారు’’ విమర్శించారు.
భారత అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేయడంపై రాహుల్ గాంధీ ఉద్దేశమేమిటని నడ్డా ప్రశ్నించారు. ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని, జీ20 సమావేశాలు ఇక్కడ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని, పార్లమెంటును అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టుపై నుంచి పడిపోయిన బస్సు.. 25 మందికి..
కొంత కాలంగా రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యూకే పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగంలో నిరసన తెలుపుతున్నారు. దీంతో సభ సజావుగా సాగడం లేదు. అయితే బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది, బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యుల విమర్శలకు సమాధానం ఇవ్వడానికి పార్లమెంటులో మాట్లాడడానికి అనుమతించాలని రాహుల్ గాంధీ కోరారు.
అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన వ్యాఖ్యలను బీజేపీ తప్పుగా ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.యూకేలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి.