పంజాబ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. సోమవారం రాత్రి నుండి అమృత్ సర్ రూరల్ జిల్లాలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో తెలుసా?

పంజాబ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు చావుబ్రతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని నాలుగు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

అమృత్ సర్ రూరల్ జిల్లా ఎస్ఎస్పి మణీందర్ సింగ్ కల్తీ మద్యం మరణాలను ఖరారు చేసారు. తెర్వాల్. మర్రి, పాటల్ పురి, భంగాలి గ్రామాల్లో కల్తీ మద్యం తాగడంతో మరణాలు సంభవించాయని ఆయన తెలిపారు. ఇంకా చాలామంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు... కాబట్టి మరణాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. 

సోమవారం రాత్రి నుండి ఈ మరణాలు సంభవిస్తున్నాయి... ఈ ఘటనలో మద్యం సరఫరాదారు పరబ్జీత్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తున్నట్లు... కల్తీ మద్యం మాఫియాపై కీలక విషయాలు బైటపడుతున్నాయని ఎస్ఎస్పీ వెల్లడించారు. కల్తీ మద్యం మరణాలపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉందని... కఠిన చర్యలు తీసుకోవాలని తమకు ఆదేశాలు అందాయని మణీందర్ సింగ్ తెలిపారు.

ఈ కల్తీ మద్యం మరణాలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించిన ఆయన తక్షణ సాయం కింద ఒక్కొక్కరి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారి వైద్యానికయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 

 అయితే గతంలో ఇలాగే పంజాబ్ లో కల్తీ మద్యం తాగి మరణాలు సంభవించిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నారు. గతేడాది (2024) మార్చిలో ఇలాగే సంగ్రూర్ లో కల్తీ మద్యం తాగి 24 మంది...  2020 లో అయితే 100 మందికిపైగా చనిపోయారు. ప్రభుత్వం కల్తీ మద్యం నివారణకు ఎన్ని చర్యలు లాభంలేకుండా పోయింది... ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయి.