బెట్టింగ్ భూతం పంజా విసురుతూనే ఉంది. ఈ విష వలయంలో చిక్కుకొని యువత బలవుతూనే ఉంది. పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా యువత మాత్రం బెట్టింగ్ యాప్లను వీడడం లేదు. తాజాగా హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ కారణంగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్లోని అంబర్పేట్ వనినగర్లో ఓ 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆర్థిక సమస్యలతో పాటు ఆన్లైన్ బెట్టింగ్లో నష్టం చూసినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తిరుమల శెట్టి వంశీకృష్ణగా గుర్తించారు. వంశీ కృష్ణ నెల్లూరు జిల్లాకు చెందినవాడు. హైదరాబాద్లో ఓ థియేటర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్కి బానిసై ఎక్కువగా డబ్బులు కోల్పోయినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చలేని పరిస్థితిలో వంశీ తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం – వంశీకి అప్పులు చేసిన వారు ఒత్తిడి తెస్తుండగా, అతడు ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం వంశీ పెద్ద అన్న ఫోన్ చేయగా లిప్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి అతని స్నేహితుడు ఆనంద్ను ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లిన ఆనంద్, తలుపు లోపల నుంచి మూసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు పక్కా వివరాలు తెలుసుకున్న తర్వాత, స్థానికుల సహాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా వంశీ అప్పటికే మరణించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబానికి అప్పగించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వంశీ ఇటీవల తీసుకున్న అప్పుల వివరాలు, ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించిన సమాచారం ఆధారంగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా?
మీరు లేదా మీ పరిచయంలోని ఎవరికైనా మానసిక సహాయం అవసరమైతే, వెంటనే మీకు సమీపంలోని మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. లేదా 'రోష్ని' (Roshni) స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా సహాయం పొందవచ్చు. హెల్ప్లైన్ నంబర్: 040–66202000 (24x7 అందుబాటులో ఉంటుంది). జీవితంలో కష్టాలు రావడం సర్వసాధారణం వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలి తప్ప ఇలా ప్రాణాన్ని బలి తీసుకోవడం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.