Hyderabad: మార్చి 1 నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.50 పెరగ్గా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.350 పెరిగింది. తాజా పెంపుతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,155 కు చేరుకుందనీ, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు, ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న‌లకు దిగారు. 

LPG Cylinder price hike: రోజురోజుకూ పెరుగుతున్న వంటగ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్.. న్యూఢిల్లీలో నిరసన చేపట్టి బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను దేశ ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించింది. మంత్రి హరీష్ రావు తమ నియోజకవర్గంలో నిరసన తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం (బీజేపీ) ఎల్పీజీ సిలిండర్ ధరలను రెట్టింపు చేసిందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

వేలాది మంది మహిళలు ఆందోళన

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను నిరసిస్తూ సూర్యాపేటలో గురువారం మహిళలు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ ఎస్ మహిళా విభాగం నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. మునిసిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధ‌ర‌ల పెంపు పేదల వెన్ను విరిచేస్తుందని ఆమె అన్నారు. గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాటం ఆగదని ఆమె ప్రతిజ్ఞ చేశారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే బీజేపీ ప్రభుత్వం వారిపై పెనుభారం మోపుతోందని విమర్శించారు.

పెంచిన ధరలు వెనక్కి తీసుకోవాలి..

గురువారం మహబూబ్ నగర్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ‌రాజ‌ధానిలో నిరసన చేపట్టి బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను దేశ ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద వందలాది మంది మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని, 3 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించి, ఎన్నికలు ముగిశాక అర్ధరాత్రి గ్యాస్ ధరలను పెంచి మహిళలపై భారం మోపిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు విధానాలను అమలు చేస్తోందనీ, ఎన్నికలు ముగిశాక సామాన్య ప్రజలపై భారం మోపుతున్నార‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన‌ వంటగ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ లక్షలాది మంది మహిళలతో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను ఉపసంహరించుకునే వరకు పోరాడుతుందని హెచ్చరించారు. 

మహిళల కష్టాలు పెంచేందుకే.. 

మహిళల కష్టాలు పెంచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లెలగూడ నుంచి మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు నిర్వహించిన కార్యక్రమంలో సబిత మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1,150కు పెంచారన్నారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా మహిళలు ఆందోళన కార్యక్రమాలు చేపడతార‌ని పేర్కొన్నారు.

నిజామాబాద్ లో ఆర్‌ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించారు. గృహ, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచడం ద్వారా ప్రజలపై భారం పడుతోందని అన్నారు.