నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు రైలుపై దాడి చేశారు. 1000 మంది వరకు ఉన్న ఓ గుంపు రైలుపై రాళ్ల వర్షం కురిపించింది. దీంతో కోచ్ లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైల్వే సంస్థ ఆ ప్రాంతంలో తాత్కాలికంగా సేవలు నిలిపివేసింది.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలు హింసాత్మక ఘటనలకు దారి తీస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో కూడా ఇదే జరిగింది. ఓ గుంపు రైలును ధ్వంసం చేసింది. నదియా జిల్లాలోని బెతువదాహరి రైల్వే స్టేషన్లో దాదాపు 1,000 మంది గుంపుగా వచ్చి లాల్గోలా-రానాఘట్రైన్ లోకల్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ధృవీకరించారు.
బీజేపీ కుటిలత్వం పాక్ జలసంధిని దాటి శ్రీలంకను చేరింది - రాహుల్ గాంధీ
‘‘1,000 మందితో కూడిన వికృత గుంపు రైలుపై రాళ్లు రువ్వింది. కొంతమంది గాయపడ్డారు. ప్రస్తుతానికి, అక్కడ రైలు నడవడం లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్నాము ’’ అని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏకలవ్య చక్రవర్తి వార్తా సంస్థ ఏఎన్ఐతో తెలిపారు. కాగా ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు, ఇతర పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు.
బెంగాల్లోని హౌరా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు హింసాత్మకంగా మారిన ఒక రోజు తర్వాత పెద్ద సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను వెంబడించారు. వారిలో కొందరు స్టేషన్లోకి ప్రవేశించి ప్లాట్ఫారమ్పై ఉన్న రైలుపై రువ్వారు. ఈ దాడిలో లాల్గోలా లైన్లో రైలు సేవలు దెబ్బతిన్నాయి.
తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకపోయానని కుమారుడి ఆత్మహత్య.. ఎక్కడంటే ?
ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని, శాంతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. పలువురు తృణముల్ కాంగ్రెస్ నేతలు కూడా శాంతియుతంగా ఉండాలని సూచించారు. ‘‘హింస నిరసన నుండి దూరం చేస్తుంది. దానికి తోడవదు. ద్వేషపూరిత ప్రసంగాల చట్టాలను ఉగ్ర ద్వేషపూరిత ప్రేరేపకులపై వర్తింపజేసినట్లే, నిరసనకారులు ప్రదర్శనలు చేసేటప్పుడు చట్ట పరిధిలోనే ఉండాలి. దయచేసి శాంతిని కాపాడుకోండి ’’ అని తృణమూల్కు చెందిన మహువా మోయిత్రా ట్వీట్ చేశారు.
శుక్రవారం పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాలో కూడా ముస్లింలు చేపట్టిన నిరసన తీవ్ర హింసాకాండగా మారింది. హౌరాలోని 116వ నెంబరు జాతీయ రహదారిపై ఆందోళనకారులు రచ్చ రచ్చ చేశారు. రోడ్లపై ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. వీధుల్లోకి వచ్చి టైర్లను తగలబెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై కామెంట్స్ ను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ నిరసనలు తీవ్రంగా ఖండించారు. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన వారు ఢిల్లీకి వెళ్లి ప్రధాని రాజీనామా కోసం డిమాండ్ చేయాలని సూచించారు. ‘‘ ఇలాంటి హింసాత్మక నిరసనకు నేను మద్దతు ఇవ్వబోను. మీరందరూ అంత కోపంగా ఉంటే ఢిల్లీకి వెళ్లి శాంతియుతంగా నిరసన తెలపండి. అలాగే ప్రధాని రాజీనామాను డిమాండ్ చేయండి. మీరు ఇక్కడ ఎందుకు మరో కొత్త సమస్యను సృష్టిస్తున్నారు? మీరందరూ శాంతిని కాపాడాలని, నిరసనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను ’’ అని సీఎం పేర్కొన్నారు.
