7 డిఫెన్స్ కంపెనీలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయదశమి నాడు కీలక ప్రకటన చేశారు. కొత్తగా స్థాపించిన ఏడు డిఫెన్స్ కంపెనీలను జాతికి అంకితం చేస్తూ ప్రధాని ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయదశమినాడు కీలక ప్రకటన చేశారు. ఏడు డిఫెన్స్ సంస్థలను జాతికి అంకితం చేస్తూ ప్రకటించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ రోజు మాట్లాడారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, డిఫెన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఏడు కంపెనీలు తమ పనిలో రీసెర్చ్, ఇన్నోవేషన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీ కోరారు. భవిష్యత్ టెక్నాలజీకి మీరు నాయకత్వం వహించాలని, పరిశోధకులకు సరికొత్త అవకాశాలనివ్వాలని సూచించారు. ఈ దిశగా ఉనికిలోకి వచ్చే స్టార్టప్లనూ ఈ ఏడు కంపెనీలు తమలో కలుపుకోవాలని తెలిపారు.
మనదేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు 200 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిలోనే నిర్వీర్యం చేసింది. ఈ ఫ్యాక్టరీ బోర్డులో నుంచే ఏడు కంపెనీలను ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో పని చేసిన 70వేల ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. 70వేల ఉద్యోగులను ఈ ఏడు కంపెనీల్లో ఎలాంటి మార్పులు లేకుండా అవే వర్కింగ్ కండీషన్లతో కొనసాగనున్నారు.
Also Read: మిలిటరీ బలోపేతానికి డిఫెన్స్ మినిస్ట్రీ కీలక నిర్ణయం.. రూ. 7,523 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులకు ఆర్డర్
ఈ ఏడు కంపెనీలు మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్(ఎంఐఎల్), ఆర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఏఎన్ఐ), అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (ఏడబ్ల్యూఈ ఇండియా), ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్(టీసీఎల్), యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్), ఇండియా ాప్టెల్ లిమిటెడ్ (ఐవోఎల్), గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్(జీఐఎల్). వీటిని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.
ప్రభుత్వ శాఖలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును తాజాగా ఏడు 100శాతం ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలుగా కేంద్రం మార్చింది. దేశ రక్షణ శాఖను పటిష్టం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ నిర్ణయంతో రక్షణ శాఖకు నైపుణ్యం, నిర్వహణలోనూ స్వతంత్రత, నూతన ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది.