జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పాలన, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి విభిన్న అంశాలపై సమగ్ర చర్చ జరిగేలా TV9 నెట్ వర్క్స్ WITT పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
దేశ రాజధాని న్యూడిల్లీలో ప్రముఖ మీడియా సంస్థ TV9 ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. 'What India Think Today (WITT) 2026' (నేటి ఇండియా ఏం ఆలోచిస్తోంది) అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. రెండ్రోజులపాటు ఈ కార్యక్రమం జరిగింది.
మోదీ సర్కార్ పై రామురావు ప్రశంసలు..
ఈ సందర్భంగా రామురావు మాట్లాడుతూ... ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది... కానీ ఇండియా మాత్రం స్థిరంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. మానవ వనరుల విషయంలో ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. మన దేశ యువతపై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోందని రామురావు అన్నారు.
భారత ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రామురావు తెలిపారు. యువ జనాభా, ఆంగ్ల భాషపై పట్టు, STEM రంగాల్లో ప్రతిభ, సాంకేతిక నైఫుణ్యాలు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన, సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేటితరం యువత కలిగివుంటోందని అన్నారు. అందువల్లే ప్రపంచంలో ఇండియా గ్లోబల్ టాలెంట్ హబ్ గా నిలుస్తోందని జూపల్లి రామురావు పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్దిలో దూసుకుపోతోందని... ఏకంగా 7 శాతం వృద్ధిరేటు కలిగివుందని రామురావు తెలిపారు. అలాగే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, యువతకు అందుతున్న అవకాశాలు దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని రామురావు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ఇక TV9 నెట్ వర్క్స్ నిర్వహించిన ఈ WITT కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ భారత్ దూసుకుపోతోందని... దిగుమతి చేసుకునే స్థాయినుండి ఎగుమతి స్థాయికి ఎదిగిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఇంటర్నేషనల్ పాలసీలు, వ్యాపారం, టెక్నాలజీ రంగాలపై చర్చకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


