Congress: ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు, భారత ప్రధాని మోడీ ఇద్దరూ ఒక్కటే: కాంగ్రెస్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ ఒకే తాను ముక్కలని కాంగ్రెస్ పేర్కొంది. ఇద్దరూ ఒకే తీరు మనుషులని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు.
![pm narendra modi and israel pm benjamin netanyahu are same kind says congress in pro palestine rally kms pm narendra modi and israel pm benjamin netanyahu are same kind says congress in pro palestine rally kms](https://static-ai.asianetnews.com/images/01h9at1wbm47dxmvstp3k68gzb/kc-venugopal--2-_363x203xt.jpg)
న్యూఢిల్లీ: కేరళలోని కోళికోడ్లో పాలస్తీనాకు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మధ్య పోలికలు తీశారు. వీరిద్దరి తీరూ ఒకేలా ఉంటుందని ఆయన చెప్పారు.
నెతన్యాహు, మోడీ ఇద్దరూ ఒకే తరహా మనుషులని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఒకరేమో జియోనిమజం గురించి మరొకరు జాతి హననం గురించి అని వివరించారు.
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోళికోడ్లో పాలస్తీనాకు సంఘీభావంగా ఓ ర్యాలీ తీసింది. ఇంకా హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శశిథరూర్ సహా ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు కూడా హాజరయ్యారు.
పాలస్తీనా ప్రజలు వారి జన్మ భూమి కోసం పోరాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడూ మద్దతుగానే నిలబడిందని కేసీ వేణుగోపాల్ వివరించారు. అమెరికా ఎల్లప్పుడూ వలసవాదాన్ని, ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తున్నదని తెలిపారు. మోడీ కూడా ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారని వివరించారు. సాధారణంగా ప్రధాన మంత్రి ఒక స్టేట్మెంట్ విడుదల చేయాలంటే చాలా ప్రొసీజిర్లకు లోనవుతుందని, కానీ, ఈ విషయంలో మాత్రం ప్రధాని మోడీ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించారని చెప్పారు.
యుద్ధం మొదలుకాగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానం విడుదల చేసిందని, దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ఇదే వర్తిస్తుందని కేసీ వేణుగోపాల్ వివరించారు.