ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌తలు నెల‌కొన్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆ ఉద్రిక్త‌లు శాంతించాయి. ఈ త‌రుణంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోమవారం దేశ ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడ‌నున్నార‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌ధాని ఏం మాట్లాడ‌నున్నార‌న్న దానిపై అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది.   

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ చేప‌ట్టి ఆప‌రేష‌న్ సిందూర్ ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. భార‌త ఆర్మీ నిర్వ‌హించిన ఈ ఆప‌రేష‌న్‌లో ప‌దుల సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉన్న మొత్తం 9 ఉగ్ర స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఇండియ‌న్ ఆర్మీ దాడి చేసింది. 

ఆ త‌ర్వాత ప్ర‌తీకారంగా పాకిస్థాన్ ఆర్మీ భార‌త్‌పై దాడుల‌కు దిగ‌డం, అనంత‌రం ఇరు దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే పహల్గామ్ దాడికి ముందు పలుసార్లు మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత పెద్దగా స్పందించలేదు. 

ఆపరేష్ సిందూర్‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్రివిధ ద‌ళాలు వివ‌రిస్తూ వ‌స్తున్నాయి. అయితే మోదీ మాత్రం దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే చాలా రోజుల త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడ‌నున్నార‌ని తెలుస్తోంది. సోమ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌ధాని త‌న సందేశాన్ని ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. 

ఏం మాట్లాడ‌నున్నారు.? 

ప్ర‌ధాని ఏం మాట్లాడ‌నున్నార‌న్న దానిపై ఇప్పుడు స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంది. ఆప‌రేష‌న్ సిందూర్‌తో పాటు పాకిస్థాన్‌పై భార‌త వైఖ‌రి ఎలా ఉండ‌నుంద‌న్న అంశంపై మోదీ వివ‌రించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అదే విధంగా క‌శ్మీర్ అంశంపై అమెరికా మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తుంద‌ని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా మోదీ స్పందించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇంత‌కీ మోదీ ఏం మాట్ల‌డ‌నున్నారు.? ఎలాంటి కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌నేది వేచి చూడాల్సిందే.