New Delhi: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో కలిసి గురువారం నాడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరిగే నాలుగో టెస్టును వీక్షించనున్నారు. ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. తన పర్యటనలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
PM Modi, Anthony Albanese in Motera: గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా నాల్గో టెస్టు తొలి రోజు ఆటలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కు ప్రధాని మోడీ స్టేడియంలో ఘనస్వాగతం పలికారు. ఇద్దరు ప్రధానులకు స్టేడియానికి వచ్చిన లక్షలాది మంది చప్పట్లతో స్వాగతం పలికారు. మ్యాచ్ కు ముందు మోడీ, అల్బనీస్ ఇరుజట్ల ఆటగాళ్లతో సమావేశమయ్యారు.
వివరాల్లోకెళ్తే.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో కలిసి గురువారం నాడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరిగే నాలుగో టెస్టును వీక్షించనున్నారు. ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. తన పర్యటనలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కు భారీ చప్పట్లతో స్వాగతం పలికారు. భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇద్దరు ప్రధానులు గోల్ఫ్ కారులో భారీ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ప్రధాని మోడీ, అల్బనీస్ తమ జట్టు కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ లకు టెస్టు క్యాప్ లను అందజేశారు.
భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని బుధవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. నిన్న అర్థరాత్రి ప్రధాని మోడీ రాష్ట్రానికి చేరుకున్నారు. భారత్ లోని అహ్మదాబాద్ లో అపూర్వ స్వాగతం లభించిందనీ, ఆస్ట్రేలియా-భారత్ సంబంధాలకు ఇది ఒక ముఖ్యమైన పర్యటనగా ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, మన ప్రాంతంలో సుస్థిరత, వృద్ధికి శక్తిగా ఉండాలనే నిబద్ధతను తన పర్యటన ప్రదర్శిస్తుందని అల్బనీస్ తన ట్వీట్ లో తెలిపారు. సబర్మతీ ఆశ్రమానికి వెళ్లిన ఆస్ట్రేలియా ప్రధానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. ఇరు దేశాలను కలిపే అంశాల్లో క్రికెట్ కూడా ఒకటనీ, అహ్మదాబాద్ లో జరిగే తొలి రోజు మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల నేతలను చూడటం గొప్పగా ఉంటుందని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్ అన్నారు.
ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం సాధిస్తే జూన్ 7 నుంచి లండన్ లో ఆస్ట్రేలియాతో తలపడనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
