దేశంలోని అత్యంత శక్తివంతుల జాబితాను  ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ ప్రకటించింది.  

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత పవర్‌ఫుల్ ఇండియన్స్ 2024 జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. భారతదేశంలో పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాను ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రకటించింది. అయితే ఇందులో 10 మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకులున్నారు.

also read:బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్: సందేశ్ ఖాళీలో ఆందోళనలెందుకు, ఎవరీ షేక్ షాజహాన్ ?

మరో వైపు బిలియనీర్ గౌతం అదానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వంటి వారికి టాప్ 10 జాబితాలో చోటు దక్కింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చోటు దక్కింది. టాప్ 16వ స్థానంలో రాహుల్ గాంధీ నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ టాప్ 18వ స్థానంలో నిలిచారు.


1. నరేంద్ర మోడీ

ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారంగా భారత్ లో అత్యధిక పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టాప్ 1 స్థానంలో నిలిచారు. సోషల్ మీడియాలో నరేంద్ర మోడీకి 95.6 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి నేతల్లో ఇది అత్యధికం.

2. అమిత్ షా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత్ లో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో రెండో స్థానంలో అమిత్ షా నిలిచారు.2023 డిసెంబర్ మాసంలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. ఈ విజయాల వెనుక అమిత్ షా ప్రధాన కారణంగా చెబుతారు.

3.మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ భారత్ లోని మూడవ అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తిగా నిలిచాడు.రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు మోహన్ భగవత్ పాల్గొన్నారు.

4. డీవై చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది.

5. జైశంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దేశంలో అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తుల్లో ఐదో స్థానంలో నిలిచారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తన దౌత్య నైపుణ్యంతో భారతవాణిని ప్రపంచ వ్యాప్తంగా వినిపించారు.ఖలీస్తాన్, రష్యా చమురుపై ఆంక్షల సమయంలో భారత్ వైఖరిని వివరించారు. 

6. యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారతదేశంలో పవర్ ఫుల్ వ్యక్తుల్లో ఆరో స్థానంలో నిలిచారు.యూపీలోనే దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్నాయి.యూపీ రాష్ట్రంలో అభివృద్ది పనులకు కేంద్ర ప్రభుత్వం బిలియన్ డాలర్లను కేటాయిస్తుంది. అయితే అభివృద్దితో పాటు రాష్ట్రంలో ప్రధాన ఆలయాలపై కూడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. 

7. రాజ్‌నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో ఏడో స్థానంలో నిలిచాడు. మోడీ కేబినెట్ లో రక్షణ మంత్రిగా పనిచేస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా కూడ రాజ్‌నాథ్ సింగ్ ను ఆయన సన్నిహితులు పిలుస్తారు.రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీలతో కూడ రాజ్‌నాథ్ సింగ్ మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు.

8. నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన మహిళా ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేస్తున్నారు. మూడేళ్లపాటు భారతదేశం ఏడు శాతం వృద్దిని నమోదు చేసింది.

9.జే.పీ. నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా దేశంలోని అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తుల్లో 9వ స్థానంలో నిలిచారు.బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణలో జే.పీ. నడ్డా కీలకంగా వ్యవహరించారు. 

10. గౌతం అదానీ

ప్రముఖ వ్యాపార వేత్త గౌతం అదానీ దేశంలోని అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో పదో స్థానంలో నిలిచాడు.101 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన అదానీ గ్రూప్ సామ్రాజ్యానికి గౌతం అదానీ అధిపతి. అదానీ సంస్థలు ప్రారంభించిన సంస్థలు వేగంగా వృద్ది సాధించాయి. దీంతో ఆసియాలో అత్యంత ధనవంతుల్లో అదానీ టాప్ 1 స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ భారత్ లో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో 11వ స్థానంలో నిలిచారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారంగా అంబానీ ఆస్తుల నికర విలువ రూ. 109 బిలియన్ డాలర్లు.