పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక పార్లమెంట్ సెషన్కి సంబంధించిన అజెండాపై అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం వుంది.

ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 17) ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేక పార్లమెంట్ సెషన్కి సంబంధించిన అజెండాపై అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం వుంది. పార్లమెంట్ పాత భవనంలో సమావేశాలు ప్రారంభమై.. సెప్టెంబర్ 19న కొత్త భవనానికి మారనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇక, కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగియగా.. వాటిని ప్రస్తుతం ఉన్న పాత భవనంలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెట్టనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఏజెండాను కేంద్రం వెల్లడించకపోవడంతో కాంగ్రెస్తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
సెప్టెంబర్ 18-22 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను కోరుతూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తన లేఖలో తొమ్మిది అంశాలను కూడా జాబితా చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో వాటిపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.
‘‘మీరు సెప్టెంబర్ 18, 2023 నుండి పార్లమెంటు ఐదు రోజుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఆ సమావేశాల అజెండా గురించి మాకెవ్వరికీ తెలియదు’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.