భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాకిస్తాన్ సైన్యం వరుసగా 11వ రోజు కాల్పుల విరమణ ఉల్లంఘించింది. భారత సైన్యం కూడా ఈ కాల్పులకు ధీటుగా జవాభిచ్చింది.
India Pakistan: పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా పాక్ సైన్యం భారత ఆర్మీ టార్గెట్ గా రాత్రుళ్లు కాల్పులకు తెగబడుతోంది. గత రాత్రి కూడా ఎల్వోసి వద్ద కాల్పులు జరిగాయి. కానీ భారత సైన్యం పాక్ దుశ్చర్యను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెండర్, నౌషెరా, సుందర్బని, అఖ్నూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది.
ఏప్రిల్ 25 నుంచి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. ఇలా వరుసగా 11వ రోజు కూడా కాల్పులు జరిపింది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల వేళ ఈ కాల్పులు మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఈ కాల్పులపై ఏప్రిల్ 29న భారత, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ హాట్లైన్ ద్వారా చర్చలు జరిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై భారత్ పాకిస్తాన్ను హెచ్చరించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలంలో నో ఎంట్రీ :
ఏప్రిల్ 30న పాకిస్తాన్లో రిజిస్టర్ అయిన అన్ని ఎయిర్లైన్స్ నడిపే విమానాలపై భారతదేశం నిషేధం విధించింది... ఈమేరకు గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇది మరో కీలక చర్య.
ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాకిస్తాన్కు చెందిన అన్ని విమానాలకు భారత గగనతలం మూసివేయబడిందని నోటీసు జారీ చేసింది. అయితే అంతకుముందే భారత విమానాలపై పాాక్ కూడా నిషేధం విధించింది... అంటే ఆ దేశ గగనతలంలో మనదేశ విమానాలు ఎగరకూడదన్నమాట.