India Pakistan War: బరితెగించిన పాకిస్థాన్.. ఎయిర్పోర్ట్, స్కూళ్లు, ఇళ్లపై డ్రోన్ దాడులు

Synopsis
పాకిస్థాన్ బరితెగిస్తోంది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు నిర్వహిస్తే. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ సామాన్యులపై దాడికి దిగుతోంది. వరుసగా రెండో రోజు పాకిస్థాన్ దాడులకు దిగింది. తాజాగా శుక్రవారం రాత్రి మరోసారి డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది.
జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ మరోసారి దాడులకు దిగుతోంది. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ వద్ద డ్రోన్ దాడికి యత్నించింది. పదుల సంఖ్యలో డ్రోన్లు పాకిస్థాన్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన భారత భద్రతా బలగాలు డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
పాకిస్థాన్ చేస్తున్న దాడుల గురించి ప్రజలు ఆందోళన చెందొద్దని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఆర్మీ భారత పౌరులను టార్గెట్ చేసుకొని దాడులకు తెగబడుతోంది. జనావాసాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. పంజాబ్ ఫిరోజ్పురలో డ్రోన్ దాడిలో ఓ కుటుంబం గాయపడింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సరిహద్దుకు 100కిమీ దూరంలోని హొశియాపుర్లోనూ పేలుడు శబ్దాలు కలకలం రేపాయి. మరోవైపు జలంధర్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.
సామాన్య ప్రజలతో పాటు స్కూళ్లను, విమానాశ్రాయలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది. జమ్ముకశ్మీర్లో తమిళనాడుకు చెందిన 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.
కాగా ఓ వైపు పాక్ దాడులు కొనసాగుతోన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్మీతో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.