ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే భారత్ కోరికను పాకిస్తాన్ ఇంతకుముందు తిరస్కరించింది. పహల్గాం దాడి తర్వాత భారత్ సిందూ నదీ ఒప్పందాన్ని నిలిపివేసింది.

ఢిల్లీ: భారత్‌తో కొనసాగుతున్న జలవివాదం నేపథ్యంలో, సిందూ నదీ ఒప్పందం అంశంపై చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఇంతకాలం వరకు భారత్ అభ్యంతరాలను పట్టించుకోని ఇస్లామాబాద్, ఇప్పుడు ఆ విషయాలపై చర్చించేందుకు ఆమోదం తెలిపింది. ఒప్పందం నిబంధనలపై సంపూర్ణంగా చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమన్న విషయాన్ని ఈమధ్యే భారత్‌కు పంపిన లేఖలో పేర్కొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సమకాలీన పరిణామాల నేపథ్యంలో, భారత్ గతంలో సిందూ ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి అనంతరం భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దానికి ప్రతిస్పందనగా, ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని పాకిస్తాన్ లేఖ రాసింది. ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల సమస్య మరింత ముదిరే అవకాశముందని పాక్ అభిప్రాయపడింది.

సింధు నది సహా ఆరు ఉపనదుల నీటి పంపిణీకి సంబంధించి 1960లో కుదిరిన ఒప్పందం ప్రకారం, తూర్పున ఉన్న సట్లెజ్, బియాస్, రావి నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా, పశ్చిమ నదులైన ఝీలం, చీనాబ్, సింధు నదుల నీరు పాకిస్తాన్ వినియోగానికి కేటాయించింది. అయితే, ఈ నీటిని వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే వినియోగించాల్సి ఉండే నిబంధనలున్నాయి. ప్రవాహాన్ని ఆపడం లేదా ప్రాజెక్టులు నిర్మించాలంటే పాకిస్తాన్ అనుమతి అవసరం.

భారత్ ఒప్పందం నుంచి బయటపడుతున్నట్లు ప్రకటించడం వల్ల, ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలన్నింటినీ నిలిపివేసినట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మొదటిసారిగా చర్చల అవసరాన్ని గుర్తించి, ముందడుగు వేసింది.ఇప్పటివరకు పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ ప్రతిపాదనలను తిరస్కరించగా, తాజా పరిణామంతో ఉభయ దేశాల మధ్య సిందూ నదీ ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.