జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రధాని వెంటనే స్పందించి సీరియస్ కామెంట్స్ చేసారు.
Pahalgam terror attack : జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 24 మంది పర్యాటకులు మరణించారు...చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ సౌదీ అరేబియా నుండి హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి అవసరమైన సమాచారం సేకరించారు. ఉగ్రవాదుల దుష్ట కార్యకలాపాలు ఎప్పటికీ విజయవంతం కావని ప్రధాని మోదీ అన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని షా ఘటనా స్థలానికి వెళ్లాలని ప్రధానమంత్రి సూచించారు.
హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం
ప్రధాని ఆదేశాల మేరకు అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అత్యవసర సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సిఆర్ఫీఎఫ్, సైన్యం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని వదలబోమని సమావేశం తర్వాత షా అన్నారు. వారికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామని అన్నారు.
ప్రధానమంత్రికి పరిస్థితి గురించి తెలియజేశాను... శ్రీనగర్ వెళ్లి భద్రతా సంస్థలతో సమావేశం నిర్వహిస్తానని అమిత్ షా తెలిపారు. అన్నట్లుగానే వెంటనే శ్రీనగర్ కు పయనమైన ఆయన బాధితులను పరామర్శించారు... అలాగే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
''జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి పట్ల నేను బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దారుణమైన చర్యలో పాల్గొన్న వారిని వదలబోము'' అని ప్రధాని హెచ్చరించారు.
నాయకుల సంతాపం
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు.ఇటువంటి దాడులు మానవత్వానికే మచ్చ. పర్యాటకాన్ని లక్ష్యంగా చేసుకునే శక్తులు దేశ ఐక్యతకు, భద్రతకు సవాలు విసురుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ కూడా పహల్గాం ఉగ్రదాడిపై రియాక్ట్ అయ్యారు.
ఒమర్ అబ్దుల్లా రియాక్షన్
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ''ఈ దాడి ఇటీవలి సంవత్సరాలలో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతిపెద్ద దాడి. ఈ ఉగ్రవాద కాల్పుల గురించి దిగ్బ్రాంతికి గురయ్యారు... ఈ దారుణానికి పాల్పడిన దుండగులు మనుషులు కాదు. బాధితులకు మేము అన్ని విధాలా సహాయం చేస్తున్నాము. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నాం'' అని ఆయన తెలిపారు.
పాకిస్థానీ ఉగ్రవాదుల కుట్ర : బిజెపి
బిజెపి నాయకుడు రవీందర్ రైనా దీనిని పాకిస్థానీ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన పిరికిపందాల దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదులు భారతదేశ ధైర్యవంతులైన సైనికులను ఎదుర్కోలేక అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు.
దాడి ఎలా జరిగింది?
మంగళవారం మధ్యాహ్నం పహల్గాం హిల్ స్టేషన్లో ఉగ్రవాదులు పర్యాటకులపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు పర్యాటకులను వారి మతాన్ని అడిగి కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో బైసారన్ మైదానంలో కొంతమంది ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, దీనిలో చాలామంది పర్యాటకులు మరణించారు.
ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించినట్లు తెలుస్తోంది. గాయపడిన పర్యాటకులను వెంటనే పహల్గాంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన CCTV ఫుటేజ్ మరియు కొన్ని అనుమానాస్పద కార్యకలాపాల వీడియోలు భద్రతా సంస్థల వద్ద ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఇది లక్ష్యంగా చేసుకుని చేపట్టిన దాడిగా భావిస్తున్నారు.