కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై ఇండియా కూటమికి చెందిన విపక్ష పార్టీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మంగళవారంనాడు అందించారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విపక్ష ఎంపీలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటిస్ ను అందించారు. విపక్ష నేతలను దేశ ద్రోహులుగా పేర్కొన్న మంత్రి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ గుర్తు చేశారు. రాజ్యసభలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విపక్షాలను ద్రోహులుగా పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినట్టుగా జైరాం రమేష్ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినట్టుగా ట్విట్టర్ వేదికగా జైరామ్ రమేష్ వివరించారు. క్షమాపణలు చెప్పాలని ఆయన కేంద్ర మంత్రి గోయల్ ను కోరారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:విపక్షాల విశ్వాసానికి పరీక్ష: అవిశ్వాసంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ ప్రసంగానికి అడ్డుపడ్డ కాంగ్రెస్

ఇవాళ ఉదయం నుండి రాజ్యసభ మూడు దఫాలు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికే రాజ్యసభ మూడు దఫాలు వాయిదా పడింది. రాజ్యసభలో సభ్యులను పదే పదే తమ స్థానాల్లో కూర్చోవాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ కోరారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విపక్ష సభ్యులనుద్దేశించి చేసిన వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని పరిశీలించనివ్వండన్నారు. ఈ వ్యాఖ్యలు రికార్డుల్లో ఉండవని రాజ్యసభ చైర్మెన్ చెప్పారు.