అవిశ్వాసంపై  జరిగిన  చర్చలో  బీజేపీ ఎంపీ నిశికాంత్  దూబే పాల్గొన్నారు.  ఈ సమయంలో ఆయన ప్రసంగానికి  విపక్ష పార్టీ ఎంపీలు అడ్డుపడ్డారు. 

న్యూఢిల్లీ: అవిశ్వాసంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ప్రసంగించకుండా విపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్ష కూటమి అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ చర్చను ప్రారంభించారు. గౌరవ్ గోగోయ్ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత బీజేపీ తరపున నిశికాంత్ దూబే చర్చలో పాల్గొన్నారు.నిశికాంత్ దూబే ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై నిన్న నిశికాంత్ దూబే అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

నిశికాంత్ దూబే ప్రసంగానికి అడ్డు తగిలారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. అయితే దూబే వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు. ఆ తర్వాత చర్చను ప్రారంభించారు.ఈ సభలో ఉన్నవారిలో ఎక్కువ మందికి మణిపూర్ కు వెళ్లి ఉండరన్నారు.తాను సావర్కర్ ను కాలేనని రాహుల్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. జీవితాంతం కూడ రాహుల్ సావర్కర్ కాలేరన్నారు. 

మణిపూర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేనేలేదన్నారు.సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా మీరు జడ్జిమెంట్ ఇవ్వకూడదని ఆయన విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మోడీ ఓబీసీ కాబట్టే ఆయనకు క్షమాపణ చెప్పేందుకు రాహుల్ గాంధీ నిరాకరిస్తున్నారన్నారు. ఇండియా కూటమిలో ఉన్న వారిలో చాలా మందిని కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఎల్‌టీటీఈకి డీఎంకే సహకరించిందని జైన్ కమిషన్ ప్రకటించిందన్నారు.ఇండియా కూటమిలో అతి పెద్ద రెండో పార్టీ టీఎంసీ అని ఆయన గుర్తు చేశారు.

also read:మణిపూర్‌కు న్యాయం కోసమే అవిశ్వాసం:లోక్‌సభలో చర్చను ప్రారంభించిన గౌరవ్ గోగోయ్

సింగూరు హింస సమయంలో మమతకు బీజేపీ మద్దతిచ్చిందన్నారు.బెంగాల్ లో టీఎంసీ సర్కార్ ఉందంటే తమ పాత్ర ఉందని దూబే చెప్పారు.ములాయం ఇమేజ్ ను దెబ్బతీసిందేవరని ఆయన ప్రశ్నించారు. ఎన్‌సీపీ అంటే నేచురల్ కరప్ట్ పార్టీ అని ఆయన ఆరోపించారు.1980లో శరద్ పవార్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూల్చివేసిందన్నారు. శరద్ పవార్ ను స్వంత కుంపటి పెట్టుకోవాలని తామే సూచించినట్టుగా చెప్పారు. ఇది విశ్వాసం కాదు, విపక్షాల విశ్వాస పరీక్ష అని ప్రధాని చెప్పారన్నారు. అవిశ్వాసంపై రాహుల్ గాంధీ మాట్లాడుతారని ఆశించామన్నారు కానీ ఆయన రెడీగా లేరన్నారు. రాహుల్ గాంధీ లోక్ సభకు వస్తే పెద్దగా సంబరాలు చేస్తుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందన్నారు. రాహుల్ లేటుగా నిద్రలేచారేమోనని ఆయన ఎద్దేవా చేశారు.నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా కుటుంబం ఆరోపణలు ఎదుర్కొందన్నారు.కొడుకు, అల్లుడిని కాపాడేందుకు సోనియా కష్టపడుతున్నారని చెప్పారు.