PM Modi: ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పినట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై చర్య తాత్కాలికంగా నిలిపివేశారు, భవిష్యత్ చర్యలు పాకిస్తాన్ వైఖరిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.
PM Modi: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ విషయాలపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాద, సైనిక స్థావరాలపై భారతదేశం ప్రతీకార చర్యను కేవలం తాత్కాలికంగా నిలిపివేసిందని అన్నారు. పాక్ తీరు మారకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ, “ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నిజస్వరూపం ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు భారతదేశం ముందు గడ్డిపోచల్లా చెల్లాచెదురయ్యాయి. మన వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని గాల్లోనే ధ్వంసం చేసింది” అని అన్నారు.
“పాకిస్తాన్ భారత సరిహద్దుపై దాడి చేసింది. భారతదేశం పాకిస్తాన్ గుండెలపై దాడి చేసింది. భారత డ్రోన్లు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేశాయి. పాకిస్తాన్ గర్వించే వైమానిక స్థావరానికి నష్టం కలిగించాం. మొదటి మూడు రోజుల్లోనే పాకిస్తాన్ ఊహించని విధంగా భారతదేశం దానిని ధ్వంసం చేసింది. భారతదేశం దాడి తర్వాత పాకిస్తాన్ తప్పించుకునే మార్గాల కోసం వెతికింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత తగ్గించాలని వేడుకుంది” అని ప్రధాని మోడీ అన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద, సైనిక స్థావరాలపై ప్రతీకార చర్య కేవలం వాయిదా వేశామంతే : పీఎం మోడీ
“ఘోరంగా దెబ్బతిన్న తర్వాత మే 10 మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించింది. అప్పటికే మనం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను చంపేశాం. పాకిస్తాన్ గుండెల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చాం. అందుకే పాకిస్తాన్ వేడుకున్నప్పుడు, తమ వైపు నుంచి ఇకపై ఎలాంటి ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసం ఉండదని చెప్పినప్పుడు భారతదేశం కూడా దాని గురించి ఆలోచించింది” అని ప్రధాని మోడీ అన్నారు.
“మళ్ళీ చెబుతున్నా, పాకిస్తాన్ ఉగ్రవాద, సైనిక స్థావరాలపై మన ప్రతీకార చర్యను కేవలం వాయిదా వేశాం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రతి అడుగును, వారి వైఖరిని పరిశీలిస్తాం. భారతదేశంలోని మూడు సైనిక దళాలు - వైమానిక దళం, సైన్యం, నౌకాదళం, బీఎస్ఎఫ్, ఇతర అర్ధ సైనిక దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడుల తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారతదేశ విధానం” అని నరేంద్ర మోడీ అన్నారు.