కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ అమలవుతున్నదా? అనే అనుమానాలను మొదలయ్యాయి. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలతో ఈ అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపై వారి ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని కామెంట్ చేశారు. దమ్ముంటే తమ ఎమ్మెల్యేలను తీసుకోవాలని సవాల్ విసిరారు. అంతేకాదు.. భవిష్యత్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అంటూ కామెంట్ చేశారు. దేశంలో కాంగ్రెస్కు భవిష్యత్తే లేదని అన్నారు.
బెంగళూరు: ఎన్నికైన ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి.. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన ఘటనలు చూశాం. మధ్యప్రదేశ్లో అచ్చం ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇదే సూత్రం కర్ణాటకలోనూ అమలు కానుందా? మాజీ మంత్రి, బీజేపీ లీడర్ కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఇవే అనుమానాలను రేపుతున్నాయి. కర్ణాటకలోనూ ఆపరేషన్ లోటస్ ప్రారంభమైందనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
శనివారం కేఎస్ ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవిష్యత్తే లేదని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోదని జోస్యం చెప్పారు.
‘ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నది. బీజేపీలోని సగం మంది ఎమ్మెల్యేలు వారి పార్టీలోకి వెళ్లుతారని అంటున్నారు. కానీ, ఇది వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి వెళ్లలేదు’ అని అన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్కు ఓ చాలెంజ్ కూడా విసిరారు.
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఒక్క బీజేపీ ఎమ్మెల్యేనైనా కాంగ్రెస్లోకి తీసుకుని వెళ్లాలని సవాల్ విసిరారు. నెల రోజుల గడువు ఇస్తున్నానని, ఈ నెల రోజుల్లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యేనైనా కాంగ్రెస్లోకి తీసుకోవాలని చాలెంజ్ చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి ఓ వార్నింగ్ ఇచ్చారు.
‘చూస్తు ఉండండి. మీ ఎమ్మెల్ేయలకే మీపై నమ్మకం లేదు. కాంగ్రెస్కు ఈ దేశంలో భవిష్యత్తే లేదు’ అని అనుమానాలను రేకెత్తించారు. త్వరలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతారు.. చూస్తూ ఉండండి అనేలా ఆయన కామెంట్లు చేశారు. దీంతో కర్నాటకలో ఆపరేషన్ లోటస్ జరుగుతున్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి.
