‘ఆపరేషన్ లోటస్’ ఫెయిల్.. మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం కంటే చనిపోవడమే మంచిదని భావిస్తారు - కేజ్రీవాల్
ఢిల్లీలో బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ లోటస్’ ఫెయిల్ అయ్యిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని ధీమా వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియా తన వెంట ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం కంటే చనిపోవడం మంచిదని భావిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, వారిని కొనుగోలు చేసేందుకకు రూ. 800 కోట్లు ఏర్పాటు చేసుకుందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్ పోలీసుల కేసులో సీబీఐ దాడులు జరిగిన మరుసటి రోజే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీఎం పదవి ఆఫర్ చేశారని అన్నారు. తనను పదవి నుంచి తప్పించాలని కోరారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక మళ్లీ వాయిదా..?
‘‘మనీష్ సిసోడియాకు బీజేపీ సందేశం పంపింది. ఆప్, అరవింద్ కేజ్రీవాల్ లను విడిచిపెట్టాలని కోరింది. మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయనను బీజేపీలో చేరాలని వారు (బీజేపీ) కోరుకున్నారు. మనీష్ సిసోడియాకు ఢిల్లీ సీఎం పదవి ఆఫర్ చేశారు. ఆయనపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని కూడా చెప్పారు’’ అని ఆయన అన్నారు.
‘‘మనీష్ సిసోడియా మాతో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు సీఎం పదవిపై అత్యాశ లేదు. మనీష్ సిసోడియా లాంటి వ్యక్తి నాతో ఉన్నారంటే నేను నా గత జన్మలో మంచి పనులు చేసి ఉండాలి. ఇప్పుడు వారు (బీజేపీ) మా ఎమ్మెల్యేలను వెంబడించి, బీజేపీలో చేరడానికి వారికి డబ్బు ఆఫర్ చేస్తున్నారు. ఆప్ ను వీడి బీజేపీలో చేరేందుకు బీజేపీ రూ.20 కోట్లు ఆఫర్ చేస్తోందని నాకు వార్త అందింది. ఒక్క ఎమ్మెల్యే కూడా తమ ఆఫర్ ను అంగీకరించకపోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఆయన అన్నారు. సిసోడియా నివాసం వద్ద పరుపులు, గోడలను కూడా సీబీఐ తనిఖీ చేసిందని, కానీ నేరారోపణలు చేసే ఆధారాలు లభించలేదని కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలకు సంబంధించి సిసోడియా నివాసంతో సహా 31 చోట్ల సీబీఐ గత వారం దాడులు నిర్వహించింది. అయితే బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ చేపట్టిందని, అది విఫలం కావాలని కోరుకుంటూ కేజ్రీవాల్ సహా ఆప్ ఎమ్మెల్యేలంతా రాజ్ ఘాట్ కు వెళ్లి ప్రార్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బీజేపీ కోరిందని, అయితే ఆ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు తిరస్కరించారని ఢిల్లీ అధికార పార్టీ ఆరోపించింది.
ఈ విషయంలో ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇచ్చి పార్టీ మారాలని ఆఫర్ చేసింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఆ పార్టీకి రూ.800 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలి ’’ అని ఆయన డిమాండ్ చేశారు.
ఎవరి పాత్ర ఏంటో త్వరలోనే తేలుతుంది : కవిత పరువు నష్టం దావాపై బీజేపీ ఎంపీ పర్వేష్
బీజేపీ వేట ప్రారంభించిందని, అయితే నేడు కేజ్రీవాల్ నిర్వహిచిన సమావేశానికి 62 మంది ఎమ్మెల్యేలలో 54 మంది హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘‘ ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ కమలం విఫలమైంది. ఈరోజు సమావేశానికి 62 మంది ఎమ్మెల్యేలలో 54 మంది హాజరయ్యారు. ఏడుగురు ఢిల్లీకి బయట ఉన్నారు. సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ వేరే దేశంలో ఉన్నారు. మనీష్ సిసోడియా హిమాచల్లో ఉన్నారు. సీఎం ఇతర ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తమ చివరి శ్వాస వరకు ఆయన వెంటే ఉంటారని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ’’ అని భరద్వాజ్ అన్నారు. కాగా.. సీబీఐ, ఈడీ దర్యాప్తులు, మంత్రులపై దాడులు, బీజేపీ ప్రయత్నాలపై చర్చించేందుకు ఆప్ ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.