ఎవరి పాత్ర ఏంటో త్వరలోనే తేలుతుంది : కవిత పరువు నష్టం దావాపై బీజేపీ ఎంపీ పర్వేష్
తనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా పిటిషన్పై స్పందించారు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు త్వరలో నోటీసులు ఇస్తాయని .. ఎవరి పాత్ర ఏంటో అప్పుడు తేలుతుందని పర్వేష్ వర్మ జోస్యం చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువునష్టం నోటీసులపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు త్వరలో నోటీసులు ఇస్తాయని చెప్పారు. ఎవరి పాత్ర ఏంటో అప్పుడు తేలుతుందని పర్వేష్ వర్మ జోస్యం చెప్పారు. స్కాంకు సంబంధించిన వారిని త్వరలోనే విచారణకు పిలుస్తారని ఆయన అన్నారు.
కాగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిటీ సివిల్ కోర్టులో భారీ ఊరట దక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశ పూర్వకంగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు. కవిత పిటిషన్పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది.
ALso REad:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట..
ఈ మేరకు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజిందర్ సిర్సాలకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. సభలలో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా నిరధారమైన ఆరోపణలు చేయవద్దని సూచించింది. కవిత దాఖలు చేసిన పరువు నష్టం దావాపై తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.