ఒడిశా రైలు ప్రమాదం : బాధితుల కోసం జీతంలో కొంత విరాళమివ్వండి - ఎంపీలకు వరణ్ గాంధీ సూచన
పార్లమెంట్ సభ్యులందరూ తమ జీతంలో కొంత ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాల కోసం విరాళంగా ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ కోరారు. ఇలాంటి సమయంలో తామందరం బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హృదయ విదారక ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు పార్లమెంట్ సభ్యులు తమ జీతంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కోరారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆయన ఓ పోస్టు పెట్టారు. ముందుగా ఆ కుటుంబాలకు అండగా ఉండాలని, ఆ తర్వాత న్యాయం జరగాలని అందులో కోరారు. శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
టైల్స్ వ్యాపారితో యువతి అక్రమ సంబంధం.. తండ్రి, ప్రియుడు, మరొకరితో కలిసి ఆమె ఏం చేసిందంటే ?
‘‘మనమంతా ముందుకు వచ్చి మన జీతంలో కొంత భాగాన్ని విరాళంగా ఇద్దాం. తోటి పార్లమెంటేరియన్లందరికీ ఇది నా విన్నపం’’ అని వరుణ్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైలు ప్రమాదాల్లో ఇప్పటివరకు 288 మంది మృతి చెందగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 2,500 మంది ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోల్ కతాకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, భువనేశ్వర్ కు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ లోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ప్రమాదంలో 21 బోగీలు పట్టాలు తప్పి తీవ్రంగా దెబ్బతినడంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రెండు ప్యాసింజర్ రైళ్లు అతివేగంతో ఉండటం మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. శనివారం మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో 150కి పైగా రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించగా.. మరి కొన్నింటిని కొంత సమయం నిలిపివేశారు.
కాగా.. ప్రధాన మార్గంలోకి ప్రవేశించడానికి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు సిగ్నల్ ఇచ్చారని, కానీ దాని ప్రకారం కాకుండా రైలు లూప్ లైన్ లోకి ప్రవేశించి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పక్కనే ఉన్న ట్రాక్పై చెల్లాచెదురుగా పడి ఉన్న సమయంలో బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అతివేగంతో వచ్చి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యాంటీ ట్రైన్ కొలిషన్ సిస్టమ్ 'కవచ్' ఎందుకు పని చేయలేదని ప్రశ్నలు తలెత్తగా.. ఈ మార్గంలో ఆ టెక్నాలజీ అందుబాటులో లేదని రైల్వే తెలిపింది.