రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేపై గుడ్లు విసిరిన ఆందోళనకారులు.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు
ఒడిశాలో అధికార పక్షం తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఓ మహిళా టీచర్ కిడ్నాప్, మర్డర్ కేసుకు సంబంధించి రాష్ట్ర మంత్రి డీఎస్ మిశ్రా తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నడుపుతున్న కాలేజీలో మిశ్రా కొడుకు ట్రస్టీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మిశ్రా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్లతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఆయనపైకి గుడ్లు విసిరారు.
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఉధృత ఆందోళనలు చేస్తున్నారు. ఓ మహిళా టీచర్ కిడ్నాప్, మర్డర్ కేసులో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో రాష్ట్ర మంత్రి డీఎస్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సదరు మంత్రిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగానే మంత్రి డీఎస్ మిశ్రా, మరో ఎమ్మెల్యే స్నేహాంగని ఛురియాపై గుడ్లు విసిరారు. వారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలవడానికి వెళ్తుండగా శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒడిశా ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ మంత్రి జగన్నాథ్ సరకా వాహనంపై బీజేపీ కార్యకర్తలు గుడ్లు విసిరారు. పైకమాల ఛాక్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, అధికార బీజేడీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్నేహాంగిని ఛురియా కూడా ఇలాంటి ఘటననే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎకమ్రా ఛాక్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలపై ఆమె గుడ్లు విసిరారు. వీరిద్దరూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలవడానికి వెళ్తుండగానే ఈ నిరసనల సెగను ఎదుర్కొన్నారు.
Also Read: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాహనంపై గుడ్లతో దాడిచేసిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు
స్మార్ట్ హెల్త్ కార్డ్స్ పంచడానికి సీఎం నవీన్ పట్నాయక్ బీజెపూర్ ప్రయాణమై వెళ్లారు. ఇలాంటి నిరసనలు ఎదురయ్యే ముప్పు ఉన్నదని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను ముందు జాగ్రత్తగా అరెస్టు చేవారు. నవీన్ పట్నాయక్ స్మార్ట్ హెల్త్ కార్డ్ల పంపిణీ పూర్తయ్యాక పార్టీ నేతలతో సమావేశం ఉంది. దీనికి హాజరు కావడానికే మంత్రి జగన్నాథ్ సరకా, ఎమ్మెల్యే స్నేహాంగిని ఛురియా బయల్దేరి వస్తున్నారు. కానీ, వారికి అవాంఛనీయ ఘటనలు ఎదురయ్యాయి. ఈ నెల 7వ తేదీన కూడా కేంద్ర సహాయ మంత్రి డీఎస్ మిశ్రా ఇలాంటి దాడినే ఎదుర్కొన్నారు. జునాగడ్కు వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై కొందరు ఆందోళనకారులు గుడ్లు విసిరారు. నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు.
Also Read: దేశాధ్యక్షుడిపై గుడ్డు విసిరేసిన దుండగుడు.. అతనితో మాట్లాడతానన్న ప్రెసిడెంట్
కలహండి జిల్లాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ నడుపుతున్న వ్యక్తే ఓ మహిళా టీచర్ను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే, ఈ సంస్థలో మంత్రి డీఎస్ మిశ్రా కుమారుడు కీర్తి ట్రస్టీగా మాత్రమే ఉన్నాడని, కేసుకు సంబంధించి ఆయనకు ఏమీ సంబంధం లేదని బీజేడీ నేత వాదించారు. మహాలింగ్ కాలేజీ ట్రస్టీగా ఉన్నంత మాత్రానా నిందితుడితో నేరంలో పాలుపంచుకున్నాడని వాదించడం అర్థరహితమని ఆరోపణలను తిప్పికొట్టింది. కాంగ్రెస్, బీజేపీ నేతలూ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.