కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాహనంపై గుడ్లతో దాడిచేసిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) వాహనంపై కొందరు వ్యక్తులు గుడ్లు విసిరారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆదివారం చోటుచేసకుంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) వాహనంపై కొందరు వ్యక్తులు గుడ్లు విసిరారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆదివారం చోటుచేసకుంది. బీజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ), కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి అజయ్ మిశ్రా వాహనంపై గుడ్లు విసిరారు. మంత్రి అజయ్ మిశ్రా కటక్ సమీపంలోని ముండలి వద్ద సీఐఎస్లో ఒక కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే అజయ్ మిశ్రా కొడుకు అశిశ్ మిశ్రా లఖింపుర్ ఖేరీ ఘటనలో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజయ్ మిశ్రా పర్యటనను అడ్డకుంటామని ఎన్ఎస్యూఐ ఒడిశా విభాగం ఇదివరకే ప్రకటించింది.
ఈ క్రమంలోనే మంత్రికి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఆయన వాహనంపై గుడ్లు విసిరారు. వాహనాన్ని కూడా చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబందించి పోలీసులు కొందరు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక, Lakhimpur Kheriలో అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు కారణమైన అశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
రైతులను ఢీ కొట్టిన ఎస్యూవీ డ్రైవింగ్ సీటులో మంత్రి కొడుకు ఉన్నాడని మృతుల కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఆ తర్వాత 12 గంటల పాటు అశిష్ మిశ్రాను ప్రశ్నించిన పోలీసులు.. అక్టోబర్ 9న అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. ఇక, ఈ కేసులో సాక్షులుగా దాదాపు 60 మందికి పోలీసుల భద్రత కల్పిస్తున్నట్టు ఏఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ శనివారం తెలిపారు.