రామ మందిరం కోసం మోడీ తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేదు.. ఆయనే బాలసాహెబ్ కల నెరవేర్చారు - ఏక్ నాథ్ షిండే
ప్రధాని నరేంద్ర మోడీ తప్ప రామ మందిరం కోసం ఎవ్వరూ ఏమీ చేయలేదని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే కలలుగన్న రామమందిరాన్ని ప్రధాని మాత్రమే నెరవేర్చారని తెలిపారు.
రామ మందిరం కోసం ఎవరూ ఏమీ చేయలేదని, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఆలయం కోసం కృషి చేశారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. ఆదివారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోట్లాది మంది రామ భక్తుల కల అని, దీనిని ప్రధాని సాకారం చేశారని కొనియాడారు.
‘‘రామమందిరం కోసం ఎవరూ ఏమీ చేయలేదు. ప్రధాని మోడీ మాత్రమే చేశారు. బాలాసాహెబ్ ఠాక్రే కలలుగన్న రామమందిరాన్ని ఆయన నెరవేర్చారు’’ అని తెలిపారు. ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ.. కొంతమందికి హిందుత్వం పట్ల అలెర్జీ ఉందని, అందుకే తమ అయోధ్య పర్యటనతో సంతోషంగా లేరని తెలిపారు. అయితే తమ పర్యటన చాలా మందికి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. కొందరు కావాలనే హిందుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రామమందిరం బీజేపీ, శివసేనలకు రాజకీయ సమస్య కాదని, విశ్వాసానికి సంబంధించిన అంశమని అన్నారు.
పులుల గణనను విడుదల చేసిన ప్రధాని.. దేశంలో గణనీయంగా పెరిగిన సంఖ్య.. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలుసా ?
శివసేన వారసత్వ విల్లు బాణం గుర్తును తన వర్గానికి పొందడంపై షిండే మాట్లాడుతూ.. ‘‘సీఎం అయిన తర్వాత నేను మొదటిసారి ఇక్కడకు వచ్చాను. శ్రీరాముడి ఆశీస్సులతో విల్లు, బాణం గుర్తు, పార్టీ పేరు తెచ్చుకున్నాం.’’ అని అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించిన షిండే.. పాత ఉత్తరప్రదేశ్ కు, కొత్త ఉత్తరప్రదేశ్ కు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు.
యూపీలో సామాన్యులు చాలా సంతోషంగా ఉన్నారని, రోడ్లు మెరుగుపడ్డాయని అన్నారు. ఎక్కడికక్కడ లైట్లు ఉన్నాయని, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ను బుల్డోజర్ బాబా అని పిలుస్తారని, గూండాలు ఆయనను చూసి భయపడుతున్నారని షిండే అన్నారు.