ప్రధాని పదవి కోసమే బీజేపీకి నమ్మకద్రోహం.. నితీష్ కుమార్పై అమిత్ షా ఆగ్రహం
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని కావాలనే ఆశతోనే ఆయన బీజేపీకి నమ్మకద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. ప్రధాని కావాలనే ఆకాంక్షతో కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్లో చేతులు కలిపారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల బీహార్లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం నితీశ్ కుమార్. ఈ చర్య బీజేపీకి షాకిచ్చినట్లయ్యింది. దీంతో నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. దీనికి తోడు రానున్న ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా నితీశ్ బరిలో దిగుతున్నారన్న వార్తలు వారికి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైరయ్యారు. ప్రధాని కావాలనే ఆశతోనే ఆయన బీజేపీకి నమ్మకద్రోహం చేశారని అమిత్ షా ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే తక్కువ స్థానాలే జేడీయూకి లభించినప్పటికీ నితీశ్ కుమార్కి సీఎంగా అవకాశం కల్పించామని అమిత్ షా గుర్తుచేశారు. అయినప్పటికీ నితీశ్ నమ్మకద్రోహం చేశారని, ప్రధాని కావాలనే ఆకాంక్షతో కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్లో చేతులు కలిపారని అమిత్ షా ఆరోపించారు.
కాగా... దేశంలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ప్రజలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాని తీరు భారత ప్రజాస్వామ్యం, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిపి రావాలని పలు పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయేకు గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు పార్టీలతో కలిపి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే విషయంలో దేశ రాజధాని ఢిల్లీలో పలు పార్టీల నాయకులను కలిశారు.
ALso Read:లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను.. నితీష్ కుమార్ సంచలన ప్రకటన
దీనిలో భాగంగానే ఉత్తరప్రదేశ్లోని పూల్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి నితీశ్ కుమార్ లోక్సభ బరిలో నిలుస్తారన్న వార్తలపై బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ స్పందించారు. 2024 ఎన్నికల్లో నితీశ్ కుమార్ గెలవరని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు నితీశ్కు పూల్పూర్లో డిపాజిట్ కూడా దక్కదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పూల్పూర్ కాకపోయినా ఉత్తరప్రదేశ్లో ఎక్కడైనా నితీశ్ కుమార్ పోటీ చేయొచ్చని మోడీ అన్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు యూపీలో అభ్యర్ధులు లేరన్న విషయం తెలిసిందేనంటూ సెటైర్లు వేశారు. గతంలో బీఎస్పీతో కలిసి పొత్తు పెట్టుకున్నారని.. అప్పుడు బీజేపీకి 62 సీట్లు వచ్చాయని సుశీల్ గుర్తుచేశారు.