Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ దోషి క్షమాపణకు అనర్హుడు, కనికరం వద్దు : సొలిసిటర్ జనరల్


నిర్భయ కేసులో ఎలాంటి కొత్త విషయం లేదని ధర్మాసనానికి విన్నవించారు. అమానవీయ కరమైన ఇలాంటి కేసుల్లో దోషులపై కనికరం చూపించకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా వాదించారు. ఈ కేసును సాగతీసేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 
 

Nirbhaya case: Nirbhaya case: Supreme court pronounce verdict 1pm on review plea
Author
New Delhi, First Published Dec 18, 2019, 1:21 PM IST


న్యూఢిల్లీ: నిర్భయ రేప్, హత్య కేసు నిందితుల్లో ఒకరైన అక్షయ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఉరిశిక్షపై పునరాలోచించాలంటూ అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. 

ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును మధ్యాహ్నాం 1గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్ తరపున లాయర్ డాక్టర్ ఏపీ సింగ్ వాదించారు. 

మరణ శిక్ష అనేది ప్రాచీనకాలం నాటి విధానమని న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఈ శిక్షను అమలు చేయడం వల్ల నేరస్తుడు మరణిస్తాడు కానీ నేరం కాదని చెప్పుకొచ్చారు. మరణ శిక్ష విధించడం నేరగాళ్లు, దోషులను నిరోధించేలా ఎలాంటి ప్రభావం చూపలేదని వింత వాదనలు వినిపించారు. 

నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో తప్పుడు ఆధారాలతో విచారణ జరిపారని న్యాయవాది ఏపీ సింగ్ ఆరోపించారు. మీడియా, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే తన క్లయింటును దోషిగా ప్రకటించారని ఆరోపించారు. 

నిర్భయ స్నేహితుడిపైనా తీవ్ర ఆరోపణలు చఏశారు. నిర్భయ స్నేహితుడిపై పటియాలా హౌస్ కోర్టులో కేసు నమోదైందనీ ఆ కేసు ఈ నెల 20న విచారణకు రానుందని తెలిపారు. నిర్భయ స్నేహితుడు కేసుకు ఈ కేసుకు సంబంధం ఏంటని త్రిసభ్య ధర్మాసంన ప్రశ్నించింది. 

టీవీ చానెళ్లముందు కనిపించడం కోసం నిర్భయ స్నేహితుడు లంచం తీసుకున్నాడంటూ ఆరోపించారు. తన క్లయింటు అక్షయ్ కుమార్ అమాయకుడని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఆరోపించారు. 

కావాలనే అక్షయకుమార్ సింగ్ పై తప్పుడు సాక్ష్యాలు సృస్టించారని ఆరోపించారు. అంతకుముందు మరణ శిక్ష పడిన అనేక మంది ఇప్పటికీ సజీవంగా ఉన్నారని కానీ తన క్లయింటు అక్షయ్ కుమార్‌నే ఉరి తీసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తొందరపడటం వెనుక ఆంతర్యం ఏంటని వాదించారు. రాజకీయ అజెండాతోనే ఉరిశిక్ష అమలు చేసేందుకు తొందరపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. 

మరణ శిక్ష మానవ హక్కులకు, భారత సంస్కృతికి విరుద్ధమని వాదించారు. జాతిపిత మహాత్మగాంధీ మరణ శిక్షలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. వాయు కాలుష్యం కారణంగా మనం నివసిస్తున్న ఢిల్లీ గ్యాస్ చాంబర్‌‌లా తయారైందంటూ వింత వాదనలు చేశారు. 

విషపూరిత వాతావరణం కారణంగా ఆయుష్షు తగ్గిపోతుంటే ఇంకా మరణ శిక్షలు ఎందుకు? అంటూ నిందితుడి తరపు న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఇకపోతే బాధతురాలు నిర్భయ మరణ వాంగ్మూలం కూడా సందేహంగా ఉందని పనిగట్టుకుని చెప్పించారని ఆరోపించారు. 

నిర్భయ వాంగ్మూలం పరిశీలిస్తే అది ఆమె తనంత తానుగా చెప్పింది కాదన్నారు. ఈ నేరానికి పాల్పడింది అక్షయ్ సింగేనని బాధితురాలు ఖచ్చితంగా చెప్పలేదని ఆరోపించారు. మొదటి వాంగ్మూలంలో నిందితులకు సంబంధించి ఆమె ఒక్క పేరుకూడా చెప్పలేదని గుర్తు చేశారు. 

రక్తంలో వ్యాధికారక క్రిములుండే సెప్టికేమియా, అధిక ఔషధాల వాడకం వల్లే ఆమె మరణించిందంటూ లాయర్ వాదించారు. తప్పుడు ఆధారాలు సృష్టించి ఈ కేసులో తన క్లయింటు అక్షయ్‌ను ఇరికించారని ఆరోపించారు. 

నిర్భయ కేసు: రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన అక్షయ్ కుమార్ , తప్పుకొన్న సీజే...

ఇకపోతే నిర్భయ కేసులో నిందితులను ఉరితీయడం వల్ల నిర్భయ తల్లి సంతోషించినా నాలుగు కుటుంబాలు ఇబ్బందులు పడతాయని ఆరోపించారు. పుట్టుకతోనే ఎవరూ రేపిస్టులు కారని సమాజమే వారిని అలా తయారు చేస్తోందని వాదనలు వినిపించారు. సమాజంలో అసలు అపరాధి నిరక్షరాస్యతేనంటూ ధర్మాసనం ఎదుట వాదించారు. 

మరోవైపు ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులోని వాదనలన్నీ ఇంతకు ముందే చట్టబద్ధ ప్రక్రియలో పూర్తయ్యాయనీ ఇప్పుడు వాటిని మళ్లీ లేవనెత్తడం సరికాదన్నారు. 

నిర్భయ కేసులో ఎలాంటి కొత్త విషయం లేదని ధర్మాసనానికి విన్నవించారు. అమానవీయ కరమైన ఇలాంటి కేసుల్లో దోషులపై కనికరం చూపించకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా వాదించారు. ఈ కేసును సాగతీసేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్‌పై మధ్యాహ్నం ఒంటిగంటకు తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది. ఇకపోతే మంగళవారం ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. 

తన బంధువు ఒకరు గతంలో ఈ కేసును వాదించారని అందువల్ల దానిపై తీర్పు చెప్పలేనని స్పష్టం చేశారు. దాంతో జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని నూతన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. 

జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగురు దోషులు, ఒకరికి విముక్తి...
 

Follow Us:
Download App:
  • android
  • ios