Babri Mosque Demolition : దేశానికో మరక.. బాబ్రీ మసీదు కూల్చివేత.. సరిగ్గా 30 ఏండ్లు ..ఆ రోజు ఏం జరిగింది
దేశ రాజకీయ పరిమాణాలను మార్చిన ఘటనలో బాబ్రీ మసీదు కూల్చివేత ఒకటి. ఈ ఘటన 1992 డిసెంబర్ 6న జరిగింది. నేటీతో 30 ఏళ్లు పూర్తయింది . ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.
Babri Mosque Demolition : స్వాతంత్య్ర అనంతరం దేశ రాజకీయ గమనాన్ని మార్చేసిన ఘటన అదీ. సుమారు 2000 మంది అమాయకులు ధన, ప్రాణాలు కోల్పోయిన ఘటన అదీ. ఎంతో మంది జైలుపాలుకు కారణమైంది ఆ ఘటన. మరికొందరికి రాజకీయ ఎదుగుదలకు అదే కారణమైంది. అదే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన. ఈ ఘటన 1992 డిసెంబర్ 6న జరిగింది. నేటీతో 30 ఏళ్లు పూర్తయింది.
అసలు బాబ్రీ మసీదు ఎందుకు కూల్చివేశారు? అక్కడ నిజంగానే రామాలయం ఉండేలా? దాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారా? కరసేవకులు ఎందుకు ర్యాలీ ఎప్పుడు చేపట్టారు? ఎవరెవరు ఈ ఘటనలో పాల్గొన్నారు? మసీదు కూల్చివేతపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఈ ఘటనపై కమీటి ఏం రిపోర్టు ఇచ్చింది ? ఏం చేయాలని సూచించింది ? సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? ఆ తీర్పు ఎప్పుడు వచ్చింది?
హిందూ పురాణాల ప్రకారం.. అయోధ్య శ్రీరాముడు నడయాడిన ప్రాంతం. రాముడి జన్మస్థలం. కానీ ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత వివాదాస్పదంగా మారిన స్థలం. ఇక్కడ రామ ఆలయం ఉండేదని.. కానీ, మొగల్ పాలకులు ఆ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందు సంస్థల వాదన. ఆ వాదనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా బలపరించింది. బాబ్రీ మసీదును ఇస్లామేతర నిర్మాణం ఉన్న స్థలంలో నిర్మించారని నిర్ధారించింది. దీంతో 1980 వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ విహింప ఈ ప్రదేశంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయంగా గొంతు కలిపింది.
ఈ తరుణంలో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాణీ దేశ వ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు. ఈ రథయాత్రకు విశేష ఆధారణ వచ్చింది. రథయాత్ర సహా పలు ప్రదర్శనలు, కవాతులూ జరిగాయి. బాబ్రీ మసీదు వద్ద 1992 డిసెంబరు 6 న 1,50,000 మంది కరసేవకులతో ఒక ప్రదర్శన నిర్వహించారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన ర్యాలీ అనూహ్యంగా హింసాత్మకంగా మారింది. దీంతో వారికి అయోధ్యలోని బాబ్రీ మసీదు లక్ష్యంగా మారింది. 16వ శతాబ్దపు కట్టడమైన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలు చెలారేగాయి. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశంలో మత ఘర్షణలకు ఆజ్యం పోసినట్టు అయ్యింది. కొన్ని ఏండ్ల పాటు హిందూ, ముస్లింల మధ్య మతకలహాలు జరిగాయి. అలాగే.. పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో హిందువులపై ప్రతీకార దాడులు జరిగాయి.
ఈ సంఘటనలో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ నేత ఎల్కే అడ్వాణీ, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘాల్, బజరంగ్ దళ్ నాయకుడు వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియా సహా 68 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసుల నమోదు చేశారు.
ఈ ఘటన తర్వతా మసీదుని తిరిగి పునరుద్ధరిస్తామని అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహరావు ప్రకటించారు. అలాగే.. ఈ ఘటనపై దర్యాపు చేయడానికి డిసెంబర్ 16న ఎంఎస్ లిబర్హాన్ నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ సర్కార్. ఈ కమిషన్ తన నివేదికను సమర్పించేందుకు గానూ మూడు నెలల గడువు విధించారు. అయితే ఈ గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వచ్చారు. 17 సంవత్సరాల కాలంలో 48 సార్లు ఈ గడువును పొడిగించారు. ఎట్టకేలకు 2009 జూన్లో తన విచారణ దర్యాప్తు నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ 17 యేళ్లల్లో కమిషన్ దర్యాప్తుపై రూ. 8 కోట్లు వెచ్చించారు.
ఇదిలా ఉండగా, వివాదాస్పద స్థలంలోని 67 ఎకరాల భూమిని రామ్లాలా రక్షణ పేరిట అప్పటి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఆర్డినెన్స్ను 1993 జనవరిలో పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మార్చారు. ఈ వివాదంపై.. 2018లో సుప్రీంకోర్టు తీర్పుతో సంచలన తీర్పు నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది.
అయోధ్య రామజన్మభూమి వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని ప్రకటించింది. ముస్లీంలకు మసీదు నిర్మాణానికి యూపీ ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో బాబ్రీ మసీదు వివాదం సమసిపోయింది. కానీ, ఏటా ముస్లీంలు బాబ్రీ మసీదు కూల్చివేత రోజును బ్లాక్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.