డిల్లీలో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున జరిగిన వరుస ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా చాలామంది గాయపడ్డారు.
దేశ రాజధాని డిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది... దీంతో నలుగురు మరణించారు. ఈ శిథిలాల కింద మరింతమంది చిక్కుకున్నారు... దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 14 మందిని సహాయకసిబ్బంది రక్షించారు... ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగిందని అదనపు డిసిపి నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ సందీప్ లాంబా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు... దీంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇలా ఓ 14 మంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని... ఇంకా 8 నుండి 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్నట్లు డిసిపి వెల్లడించారు.
అకాల వర్షాలే కారణమా :
ఢిల్లీలో శుక్రవారం వాతావరణంలో ఆకస్మిక మార్పు సంభవించింది. శుక్రవారం రాత్రి నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మధు విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం ఆ గోడ ఆరు అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనానికి చెందినది. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) వినీత్ కుమార్ మాట్లాడుతూ, "సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు పిసిఆర్ కాల్ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఆరు అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఉంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు... గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు" అని తెలిపారు.
ఈ ఘటనను మరిచిపోకముందే శనివారం తెల్లవారుజామున మరో ఘోర ప్రమాదం జరిగింది. ముస్తఫాబాద్ లో జరిగిన ప్రమాదం కూడా ఈ వర్షాల కారణంగానే జరింగిందా? లేదా నాణ్యతా లోపంతో నిర్మించడంవల్ల జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది.