Black Magic Ritual: ఏప్రిల్ 26న మధ్యప్రదేశ్ అడవి బఫర్ జోన్‌లో ఒక పులి చనిపోయి కనిపించింది. దాని గోళ్ళు, కోరలు కూడా కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Black Magic Ritual: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో జరిగిన ఒక సంఘటన అటవీ అధికారులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. తమ భార్యలను లొంగదీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. ఈ పూజల కోసం పూలి శరీర భాగాలను ఉపయోగించారు. గోర్లు, కోరలు క్షుద్రపూజ కోసం పులి శరీరం నుంచి తొలగించారు. విచారణలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకెళ్తే.. ఏప్రిల్ 26న మధ్యప్రదేశ్ పెంచ్ అడవి బఫర్ జోన్‌లో ఒక పులి చనిపోయి కనిపించింది. దాని గోళ్ళు, కోరలు కూడా కనిపించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలో పులి సహజ మరణం పాలైందని తేలినా, దాని శరీరంపై గాయాలు అనుమానాలకు దారితీశాయి. ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. విచారణలో, ఇద్దరు వ్యక్తులు తమ భార్యలను నియంత్రించడానికి క్షుద్రపూజలు చేయడానికి పూలిని ఉపయోగించామని ఒప్పుకున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదిక ప్రకారం, రాజ్ కుమార్, ఝామ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు స్థానిక మాంత్రికుడి సలహా మేరకు పనిచేస్తున్నట్లు చెప్పారు. పులి గోళ్ళకు మాయా శక్తులు ఉన్నాయనీ, అవి వైవాహిక సంబంధాలలో ఆధిపత్యాన్ని ఇస్తాయని ఆ మాంత్రికుడు చెప్పాడని తెలిపారు. 

స్థానిక నివాసి ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అనుమానితులను పట్టుకుంది. పులి గోళ్ళు, మూడు దంతాలు, చర్మం ముక్కలు అనేక చోట్ల లభ్యమయ్యాయి. అనుమానితులు మొదట బఫర్ జోన్‌లో చేపలు పడుతుండగా పులి మృతదేహాన్ని చూశారని అధికారులు భావిస్తున్నారు. సమీపంలో మరో పులి ఉండటంతో వారు వెనక్కి వెళ్లి, మరుసటి రోజు తిరిగి వచ్చి శరీర భాగాలను నరికివేశారు.

క్షుద్రపూజకు పులి చర్మం కూడా అవసరమని వారికి మాంత్రికుడు చెప్పడంతో, వారు మళ్ళీ అడవిలోకి వెళ్లి చర్మాన్ని కూడా తీసుకున్నారు. క్షుద్రపూజలు, మూఢనమ్మకాలు ఈ ప్రాంతంలో ఇంకా ప్రబలంగా ఉన్నాయని అటవీ అధికారులు ధృవీకరించారు. ఇంతకు ముందు కూడా మంత్రవిద్య కోసం పులులు, చిరుతపులులను వేటాడిన కేసులు ఉన్నాయని చెప్పారు. 

"ఇది చాలా షాకింగ్. మూఢనమ్మకాలు ఎంత దారుణమైన పనులకు పురిగొల్పుతాయో ఇది చూపిస్తుంది" అని ఒక సీనియర్ అటవీ అధికారి అన్నారు. "సంబంధాల సమస్యలను పరిష్కరించడానికి ఇదేమి విచిత్రమైన మార్గం. చాలా మందికి వైవాహిక సమస్యలు ఉండవచ్చు, కానీ అందుకని చనిపోయిన పులుల గోళ్ళను తీయడమేంటి? ఇది చాలా హాస్యాస్పదం" అని మరో పోలీసు అధికారి అన్నారు.

మే 3న నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారిని అటవీ శాఖ కస్టడీకి అప్పగించారు. ఈ దారుణమైన ఘటనలో మరికొందరు వ్యక్తులు పాల్గొన్నారా అని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న క్షుద్రపూజలు చేసే వ్యక్తి కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.