వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం టైర్ చోరీ.. స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ‘ట్రక్ టైర్ అనుకున్నాం’
ఉత్తరప్రదేశ్లో వైమానిక దళానికి చెందిన మిరేజ్ - 2000 జెట్ టైర్ చోరీకి గురైంది. నవంబర్ 27వ తేదీ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ నెల 4వ తేదీని ఇద్దరు వ్యక్తులు ఈ టైర్ను యూపీలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు అప్పగించారు. అది తమకు రోడ్డుపై లభించిందని, ట్రక్ టైర్ అనుకుని ఇంటికి తీసుకెళ్లామని వివరించినట్టు పోలీసులు వివరించారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో(Uttar Pradesh) అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. వైమానిక దళానికి(Air Force) చెందిన ఒక యుద్ధ విమానం టైర్ను (Mirage- 2000 Tyre) దొంగిలించిన ఘటన రిపోర్ట్ అయింది. ఈ ఘటన కలకలం రేపింది. గత నెల 27వ తేదీ రాత్రిపూట ఈ చోరీ జరిగింది. దీనిపై లక్నోని ఆషియానా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ సమీపం ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇంతలోనే ఈ నెల 4వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఆ ఫైటర్ జెట్ టైర్ను ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు తెచ్చారు. చోరీ రిపోర్ట్ అయిన ప్రాంతంలో వారికి ఆ టైర్ దొరికిందని చెప్పారు. అది ట్రక్ టైర్ అనుకుని ఇంటికి తీసుకెళ్లామని వారిద్దరూ చెప్పినట్టు పోలీసులు వివరించారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ విమానం మిరేజ్-2000 జెట్ టైర్లు, ఇతర పరికరాలను బక్షి కా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి జోధ్పూర్ ఎయిర్ బేస్కు తరలిస్తున్నారు. జోధ్పూర్ ఎయిర్ బేస్ ఆర్డర్ మేరకు ఈ తరలింపు జరిగింది. మిరేజ్-2000 జెట్కు ఐదు టైర్లను, ఇతర ఎక్విప్మెంట్లను ఓ లారీ లోడ్ చేసుకుని ఉత్తరప్రదేశ్లోని బక్షి కా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరింది. అయితే, ఉత్తరప్రదేశ్లోని షహీద్ పాఠ్కు ఆ లారీ చేరగానే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది. అక్కడే కొద్ది సేపు ట్రక్కును ఆ డ్రైవర్ నిలిపాడు. ఇంతలోనే ఆ లోడ్లో ఒక టైర్ కనిపించకుండా పోయినట్టు ఆయన గుర్తించారు. వెంటనే పోలీసు స్టేషన్కు సమాచారం అందించాడు. ఆయన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. నవంబర్ 27 రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Also Read: కాబూల్లో ఉక్రెయిన్ ప్లేన్ ఎత్తుకెళ్లారు: ఔను.. హైజాక్ చేశారన్న డిప్యూటీ మినిస్టర్
పోలీసులు ఆ డ్రైవర్ను ఇంటరాగేట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా, ఆ ట్రక్ షహీద్ పాఠ్ చేరుకున్నాక అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటాన్ని కొందరు దుండగులు అదును చేసుకున్నట్టు ఇంకొందరు చెబుతున్నారు. భారీ ట్రాఫిక్ను అదునుగా తీసుకుని బ్లాక్ స్కార్పియోలో వెళ్తున్న దుండగులు లారీ నుంచి మిరేజే-2000 టైర్ను దొంగించినట్టు ఆరోపణలు చేశారు. అయితే, నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉన్నది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేశారు.
కానీ, డిసెంబర్ 4వ తేదీన ఇద్దరు వ్యక్తులు చోరీకి గురైన మిరేజ్-2000 టైర్ను తీసుకుని బక్షి కా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వెళ్లారు. ఆ టైర్ తమకు రోడ్డుపై దొరికిందని వివరించినట్టు పోలీసులు వెల్లడించారు. వారు చెప్పిన ప్రాంతంలోనే ఆ టైర్ చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఆ టైర్ ట్రక్కు టైర్ అనుకుని పొరబడ్డామని, అందుకే ఆ టైర్ను ఇంటికి తీసుకెళ్లామని వారిద్దరూ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. బక్షి కా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సిబ్బంది ఆ టైర్ను పరిశీలించారు. అది తమ డిపోకు చెందినదేనని గుర్తించారు. అది మిరేజ్-2000 జెట్దేనని ధ్రువీకరించారు.